ఖమ్మం, జనవరి 28: సీఎం కేసీఆర్ ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాలలను బలోపేతం చేశారు. ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. నిరుపేదల ఇండ్లలో ‘వెలుగులు’ నింపుతున్నారు. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేయిస్తున్నారు. అలాగే ప్రజల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఐదో జాతీయ కుటుంబ సర్వేలో దేశంలోని 50 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. ఐదేండ్ల లోపు చిన్నారుల్లో 31.2 శాతం మంది సాధారణం కంటే తక్కువ బరువు ఉన్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఉన్న ఇలాంటి వారందరిన్నీ ఆరోగ్యవంతులను చేసేందుకు సర్కార్ నడుంబిగించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రెండు మూడు నెలల్లో పోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రతి నెలా నిరుపేదలకు ఈ బియ్యాన్నే అందించనున్నది.
4,12,743 మందికి పంపిణీ
జిల్లాలోని ఎనిమిది ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా నెల నెలా 711 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతున్నది. మొత్తం 4,12,743 ఆహార భద్రత కార్డులు ఉండగా లబ్ధిదారులు 11,41,601 మంది ఉన్నారు. వీరందరికీ నెలకు 50 వేల క్వింటాళ్ల బియ్యం అందుతున్నది. సర్కార్ రూపాయికే కిలో బియ్యం అందజేస్తున్నది. అంతేగాక జిల్లాలో 1,004 ప్రాథమిక పాఠశాలలు, 211 ఉన్నత పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 56 గురుకులాలు, కేంద్రీయ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, నవోదయ స్కూల్ నాలుగు, 14 కస్తూర్బాగాంధీ (కేజీబీవీ) పాఠశాలకూ ఫోర్టిఫైడ్ బియ్యం అందుతున్నాయి.
ఫోర్టిఫైడ్ రైస్ అంటే..
కృత్రిమ విధానంలో ఆహార పదార్థాల్లో పోషకాలు చేర్చడాన్ని ఫోర్టిఫైడ్ ప్రక్రియ అంటాం. పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే (మర పట్టడం) సమయంలో వాటిని ఎక్కువగా పాలిష్ చేస్తే పోషకాలన్నీ నూక, పొట్టు రూపంలో బయటకు వెళ్తాయి. ఇలా వచ్చిన బియ్యాన్ని వండినప్పటికీ శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. పైగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదమూ ఉంటుంది. కానీ ఫోర్టిఫైడ్ రైస్తో గర్భిణుల్లో రక్తహీనతకు చెక్ పడుతున్నది. పిల్లలు ఎత్తుకు తగిన బరువు పెరుగుతారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో ఐరన్, పోలిక్ యాసిడ్ , బి- 12 వంటి పోషకాలు ఉంటాయి. 99 కిలోల బియ్యంలో ఒక్క కిలో ఫోర్టిఫైడ్ పోషకాలు కలుస్తాయి. పంజాబ్, గుజరాత్ తదితర రాష్ర్టాల నుంచి మిల్లర్లు ధాన్యాన్ని తెప్పించి వాటిని మిల్లింగ్ చేస్తారు. ఈ సమయంలోనే బియ్యంలో పోషకాలు మిక్స్ చేస్తారు. నాణ్యమైన ఫోర్టిఫైడ్ రైస్ బ్లాక్ మార్కెట్కు తరలకుండా సివిల్ సప్లయ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రెండు మూడు నెలల్లో పంపిణీ..
ప్రజలకు బలవర్థక ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ కలిసిన రేషన్ బియ్యం అందించాలనుకున్నది. సర్కార్ నిర్ణయం మేరకు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాం. ఈ బియ్యం తింటే గర్భిణుల్లో రక్తహీనత తగ్గుతుంది. పిల్లలో ఎదుగదల ఉంటుంది. వారిలో జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహల్లోని విద్యార్థులకు ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా అవతున్నది. రెండు మూడు నెలల్లో రేషన్ దుకాణాల ద్వారా అర్హులందరికీ ఈ బియ్యం అందుతుంది.
– నర్సింహారావు, పౌర సరఫరాల సంస్థ, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్), ఖమ్మం