ఖమ్మం సెప్టెంబర్ 22: తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని అన్నారు. ఖమ్మంలోని ఇళ్లు లేని పేద వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదేనని అన్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలోని నిరుపేదలకు రూ.కోట్ల విలువైన స్థలాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామని గుర్తుచేశారు. వాటికి తోడు జీవో 58 ప్రకారం అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని అన్నారు. జీవో 58 కింద 398 మందికి ఇళ్ల పట్టాలు, గృహలక్ష్మి పథకం కింద 230 మందికి నగదు మంజూరు పత్రాలను నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.
ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు వారి ఆధీనంలో ఉన్న ఇంటి స్థలంపై వారికే పూర్తి హకులు కల్పించి వారు నిశ్చింతగా జీవించేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో 58ని తీసుకొచ్చిందని అన్నారు. అలాగే, సొంత ఇంటి స్థలం ఉండి ఆర్థిక స్థోమత లేని వారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకే గృహలక్ష్మి పథకానికి రూపకల్పన చేసినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో నగరంలో ఇప్పటికే 2000 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇచ్చినట్లు చెప్పారు. అలాగే, గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున జిల్లాలో 15,500 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షలను అందించనున్నట్లు వివరించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొండబాల కోటేశ్వరరావు, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, ఆదర్శ్ సురభి, డీ.మధుసూదన్ నాయక్, మల్లీశ్వరి, గణేశ్, స్వామి, పాలెపు విజయ, కూరాకుల వలరాజు, మేడారపు వెంకటేశ్వర్లు, గజ్జల లక్ష్మి, రుద్రగాని శ్రీదేవి, పగడాల నాగరాజు, పాలెపు వెంకటరమణ, ఆళ్ల అంజిరెడ్డి, షేక్ షకీనా పాల్గొన్నారు.