ఖమ్మం, ఫిబ్రవరి 10 : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రైతన్నలకు మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలకు తగ్గినట్లుగా కేటాయింపులు లేవని, సామాన్యులను నిరాశపరిచే విధంగా ఉందని పెదవి విరుస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, మౌలిక వసతుల కల్పనకు సరైన నిధుల కేటాయింపు జరగలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టే గారడీ బడ్జెట్ మాదిరిగా ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారని పేర్కొన్నారు.
రైతుకు భరోసా ఏది?
రైతులను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచింది. అంత ఉరిమి ఇంతేనా కురిసింది అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్. వ్యవసాయానికి రూ.7,085 వేల కోట్లు కోత విధించడంతో రైతులు సంక్షోభం ఎదుర్కోక తప్పదు. గత ప్రభుత్వం వ్యవసాయానికి రూ.26,831 కోట్లు కేటాయించగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించింది. రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ బడ్జెట్లో మొండిచేయి చూపింది. రుణమాఫీ మాట ఇక దేవుడెరుగు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు, వరికి రూ.500 బోనస్ ప్రస్తావన లేకపోవడం దయనీయం. రైతును రాజు చేసేందుకు కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతన్నలను ఆగం చేస్తున్నది.
– నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ
అంకెల గారడీ..
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమే. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించింది. రైతుబంధు, రైతు రుణమాఫీ, పంటబీమా, రైతుబీమా, వడ్డీ లేని పంటరుణాలు ఇక ప్రశ్నార్థకమే. అంటే కాంగ్రెస్ పార్టీ రైతులను నిలువునా దగా చేసింది. బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను కూడా మోసం చేసింది. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన రూ.28 వేల కోట్లు ఎటూ సరిపోవు. ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ బడ్జెట్లో కేటాయించింది రూ.7,700 కోట్లు. కార్మికులకు మొండిచేయి చూపింది. తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.
– తాతా మధు, ఎమ్మెల్సీ,బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు