ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కార్ మీనమేషాలు మరోసారి రైతులను అవమానించిన కేంద్రం బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయంటున్న రైతులు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ రాష్ట్ర మంత్రుల బృందానికి అండగా నిలిచిన ప్రజలు
సేద్యానికి అరిగోస పడిన రైతులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలతో వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. 24 గంటల నాణ్యమైన విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయం పండుగలా మారింది. ఈ క్రమంలో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఇలాంటి తరుణంలో కేంద్రంలోని బీజేపీ వడ్ల కొనుగోలు విషయంలో కిరికిరి పెడుతున్నది. ధాన్యం కొనం.. బియ్యం చేసి ఇస్తే తీసుకుంటామని హేళన చేస్తున్నది. షాపులో ఏది అమ్ముడు పోతే అదే కొంటాం అని వ్యాపారిలా మాట్లాడుతున్నది. కర్షకులకు న్యాయం చేయాలని గురువారం ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందాన్ని మరోసారి అవమానించింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతులను అవమానించారు. వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడారు. ఆరుగాలం కష్టించి పంట పండిస్తున్న అన్నదాత ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో యావత్ తెలంగాణ రైతులు కేంద్ర మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలకు నూకలు అలవాటు చేయండి సమస్య అదే పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించడంపై భగ్గుమంటున్నారు. మీరైతే నూకల బువ్వ తింటారా ? అని నిలదీస్తున్నారు. బీజేపీకి రానున్న ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. కేంద్రానికి కర్షకుల ఉసురు తగులుతుందని స్పష్టం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరు జెండా ఎగురేస్తామని ప్రతిన బూనారు.
ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ ప్రభుత్వమంటే కక్ష.. ఇక్కడి రైతులంటే చిన్నచూపు.. అణువణువునా అహంకారం.. ప్రతి మాటలోనూ వ్యంగ్యం.. ధాన్యం కొనుగోలు చేయమంటే అవహేళన.. లక్షలాది మంది రైతుల సమస్య విన్నవిస్తే ఆగ్రహావేశాలు.. ఇదీ తెలంగాణ ప్రజలు, రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. తాజాగా గురువారం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్ ధాన్యం కొనుగోలుపై మంత్రులు ప్రశ్నిస్తే తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించమని ప్రకటించడం దుమారానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలోని అన్నివర్గాలు మండిపడుతున్నాయి. పంజాబ్లో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేమని చెప్పే ద్వంద్వ వైఖరిని రైతులు ప్రశ్నిస్తున్నారు.
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యం పెరిగింది. రైతులకు సీజన్కు ముందే రైతుబంధు సాయం అందుతున్నది. పంటలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నది. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవడంతో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. చెరువులు పటిష్టం కావడంతో భూగర్భ జలాలకు కొదువలేదు. ప్రభుత్వం సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నది. దీంతో ఏటా అంతకంతకు వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. బీడు భూములన్నీ సస్యశ్యామలమయ్యాయి. కేంద్రం వానకాలం సీజన్ వరకు ధాన్యం కొనుగోలు చేసి యాసంగి నుంచి కొనుగోలు చేయలేమని చెప్పడంతో ఉమ్మడి జిల్లాలో ఈసారి సాగు విస్తీర్ణం తగ్గింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. కానీ వరి తప్ప ఇతర పంటలు సాగు చేసే వీలు లేని ప్రాంతాలకు చెందిన రైతులు వరి పండిస్తున్నారు. వారు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. పోరుబాటకు సిద్ధమయ్యారు.
రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు తదితరుల బృందం గురువారం ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కానీ కేంద్ర మంత్రి మాత్రం వ్యంగ్యంగా, అవహేళనగా మాట్లాడారు. ప్రజలతో నూకలన్నం తినిపించాలని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారు.
1970లో తెలంగాణను కరువు పట్టి పీడించింది. అప్పటి పరిస్థితుల్లో ప్రజలు బియ్యానికి బదులు నూకలన్నం తినే వారు. రాష్ట్రంలో సాగునీటి వసతి ఉండి, పంటలు పండే భూమి ఉండి కూడా ఇక్కడి ప్రజలు నూకలే తినాలని బీజేపీ ప్రభుత్వం సలహా ఇవ్వడం అత్యంత హేయం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రైతులు మండిపడుతున్నారు. అన్నివర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయరంగం గాడిన పడింది. సాగుపరంగా దేశంలోనే అగ్రస్థానానికి చేరుకున్నది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. కానీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. రైతులు, ప్రజలను నూకలు తినమని చెప్తున్న బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయంటున్నారు. మరోవైపు కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేంతవరకు దశల వారీగా ఉద్యమిస్తామని రైతులు పేర్కొంటున్నారు. వారికి అండగా నిలిచిన కేంద్ర మెడలు వంచుతామని టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీ నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు సైతం నిర్వహించింది. ఇక పోరాటమే తరువాయి.
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను ఘోర అవమానాలకు గురి చేస్తున్నది. పంజాబ్ తరహాలో ఇక్కడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని అడిగితే వ్యంగ్యంగా మాట్లాడుతున్నది. కేంద్ర మంత్రి గోయల్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నూకలు తింటే సమస్య పరిష్కారం అవుతుందని హేళన చేశారు. బీజేపీ తీరును తెలంగాణ సమాజం గమనిస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఇంత అహంకారమెందుకు. వెంటనే కేంద్ర మంత్రి రైతాంగానికి క్షమాపణ చెప్పాలి.
– వెంకటయ్య, ఆరెంపుల గ్రామం, ఖమ్మం రూరల్
రాష్ట్రంలో పుష్కలంగా సాగునీటి వనరులు ఉన్నాయి. చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంది. సకాలంలో నీరు అంది పంటలు బాగా పండుతున్నాయి. మేమే ధాన్యం పండిస్తాం. మేం నూకలు తినాల్సిన అవసరం లేదు. కేంద్రం అన్ని రాష్ర్టాల నుంచి ధాన్యం కొంటున్నట్లే తెలంగాణ నుంచీ కొనాలి. కేంద్ర మంత్రి మరోసారి తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తే ఊరుకోం. రైతుల శక్తి ఏమిటో చూపిస్తాం.
– బాగం మోహన్రావు, రైతు, అంజనాపురం
కేంద్రంలోని బీజేపీ తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్నది. ధాన్యం కొనుగోలుపై మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆరుగాలం కష్టించి సేద్యం చేసే అన్నదాతలను అవమానపరుస్తున్నది. రైతులతో రాజకీయం చేస్తున్నది. షాపులో ఏది అమ్ముడుపోతే అదే కొంటామని చెప్పడం సిగ్గుచేటు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నది. పంజాబ్ తరహాలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమిస్తాం. కేంద్రం మెడలు వంచుతాం.
-నామా నాగేశ్వరరావు, ఎంపీ
కేంద్ర సర్కార్కు నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే నూకల మీద కేంద్ర మంత్రికి ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పటికే రైతు చట్టాల విషయంలో భంగపడి బీజేపీ ప్రభుత్వం చావు దెబ్బతిన్నది. అది చాలదన్నట్లు ఇప్పుడు తెలంగాణ రైతాంగం మీద అక్కసు వెల్లగక్కుతున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశారు. నూకలు తినమని చెప్పడం సరికాదు. ఇక్కడి రైతులకు సాగు చేయడం తెలుసు, అవమానపరచిన వారికి సరైన సమయంలో బుద్ధి చెప్పడమూ తెలుసు. – నల్లమల వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్
రాష్ట్ర మంత్రులు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వద్దకు వెళ్లారు. ఆ విషయం తేల్చకుండా తెలంగాణ ప్రజలను నూకలు తినమని సలహాల ఇవ్వడం సరికాదు. ముందు కేంద్రమంత్రి నూకలు తినాలి. ఆ తర్వాతే మాకు తినమని చెప్పాలి. రైతు లేనిదే దేశం లేదు.. అనే విషయం తెలిసి ఉంటే సదరు కేంద్ర మంత్రి అలా అనుచిత వ్యాఖ్యలు చేసేవారు కారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులంటే ఏమిటో చూపిస్తాం. కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు ఆలస్యమైనా మూల్యం చెల్లించుకోక తప్పదు.
– తాళ్లూరి పాపారావు, రైతు, సుజాతనగర్
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన పేచీకోరుతనాన్ని బయటపెడుతున్నది. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొర్రీలు పెడితే తెలంగాణ రైతాంగం ఉద్యమిస్తుంది. ఉద్యమ చరిత్ర కలిగిన గడ్డ తెలంగాణ. ఇక్కడ పోరాటాలు కొత్తకాదు. రైతుల హక్కులను ఎలా కాపాడుకోవాలో టీఆర్ఎస్కు బాగా తెలుసు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకార పూరిత వ్యాఖ్యలు బీజేపి పతనానికి నాంది.
-తాతా మధు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
తెలంగాణలో పండించే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. అలా కాకుండా బీజేపీ మంత్రులు రోజుకొక తీరుగ మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు, రైతాంగాన్ని అవమాన పరుస్తున్నారు. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజనూ కేంద్రం కొనుగోలు చేయాల్సిందే. వడ్లను కొనుగోలు చేయకపోగా నూకలు తినాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించడం తెలంగాణ సమాజాన్ని అవమానపరచడమే. బీజేపీ మతోన్మాద పార్టీ. ప్రజలను నట్టేట ముంచుతున్న పార్టీ.
– మలీదు నాగేశ్వరరావు, రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
తెలంగాణలో సాగునీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. పంటలు బాగా పండుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రజలు నూకలు ఎందుకు తింటారు? కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నూకలు తినాలని అవహేళన చేయడం సరికాదు. ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవడంతో రైతులు ఎక్కువగా ధాన్యం పండిస్తున్నారు. ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. ఆ బాధ్యత కేంద్రానిదే. బాధ్యతల నుంచి తప్పుకోవడం సరైంది కాదు. సీఎం కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం.
– మాదినేని రమేశ్, సీపీఎం అనుబంధ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
నేను ఏటా తొమ్మిది ఎకరా ల్లో సాగు చేపడతా. మాక్కు పుష్కలంగా సాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏటా నాలుగెకరాల్లో వరి పండిస్తా. కానీ ఈ సంవత్సరం కేంద్రం వడ్లు కొనలేం అని చెప్పడంతో ఆ నాలుగెకరాలను బీడు గానే ఉంచా. దీని వల్ల ఎంతో నష్టపోయా. కేంద్రం రైతుల నోట్లో మట్టి కొడుతున్నది. యాసంగి వడ్లను బాయిల్ చేస్తేనే మంచి బియ్యం వస్తాయి. సరాసరి పట్టిస్తే నూకలే అవుతాయి. ఈ విషయం తెలవని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నోరు పారేసుకున్నారు. ప్రజలను నూకలు తినాలని సూచించడం కచ్చితంగా అవమానించడమే.
– వెంకటపుల్లయ్య, రైతు, కాచిరాజుగూడెం, ఖమ్మం జిల్లా
తెలంగాణ రైతాంగానికి ఎంతో చరిత్ర ఉంది. దేశానికి అన్నం పెడుతున్న ఘనత మాది. అలాంటి తెలంగాణ సమాజంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నోరుపారేసుకోవడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రజలు నూకలు తినాలని మాట్లాడడాన్ని మేం ఖండిస్తున్నాం. కేంద్ర మంత్రి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర రైతులపై వివక్ష చూపడం దారుణం. పంజాబ్లో ధాన్యం కొంటున్న తీరుగానే తెలంగాణలోనూ కొనాలి. సీఎం కేసీఆర్ రైతులను ఆదుకోవాలని చూస్తుంటే కేంద్రం మాత్రం రైతులకు అన్యాయం చేస్తున్నది. – ఎ.రామిరెడ్డి, రైతు, ముత్తగూడెం, ఖమ్మం జిల్లా
యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందే. ధాన్యం కొనమంటే ప్రజలకు నూకలు పెట్టమని సాక్షాత్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడడం సిగ్గుచేటు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం. కేంద్రం రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నది. ఉద్యమించి మా హక్కులను సాధించుకుంటాం.
– ముగితె కరుణాకర్, రైతు, పెనగడప
రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా అవుతున్నది. దీంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష తగదు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమిస్తాం.ధాన్యం కొనలేమని చెప్పడం కేంద్రం బాధ్యత నుంచి తప్పించుడకోవడమే అవుతుంది.
– మాలోత్ లక్ష్మయ్య, రైతు, పెనగడప
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలు ఆయనలోని అహంకారానికి నిదర్శనం. 40 ఏండ్ల క్రితం తెలంగాణ ప్రజలు నూకలు తినేవారు. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోజురోజుకు అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణలో నూకలు ఎవరూ తినడం లేదు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నది.
– దొండపాటి రమేశ్, సీపీఐ అనుబంధ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు