మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తేనే మనిషి మనుగడ సాధ్యం. వాటికే ముప్పు వాటిల్లితే జీవితం అగమ్యగోచరమే. మళ్లీ కిడ్నీలు యథాస్థితికి చేరుకోవాలంటే.. ఫంక్షనింగ్ సక్రమంగా జరగాలంటే డయాలసిస్(రక్తశుద్ధి ప్రక్రియ) తప్పనిసరి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేద రోగులు డయాలసిస్ చేయించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడేవారు. ఒక్కసారి ప్రైవేటు ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటే వేలల్లోనే ఖర్చు. అలాంటి వ్యాధిగ్రస్తులకు పైసా ఖర్చు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 6 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి రోజుకు 500 మందికి ఉచితంగా సేవలందిస్తోంది. రోగులకు దీర్ఘాయుష్మాన్భవ అంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం దీవెనలందిస్తోంది. ఉచిత బస్ పాస్తోపాటు రూ.2,016 పింఛన్ అందిస్తూ ప్రభుత్వం మన్ననలు పొందుతోంది.
– సత్తుపల్లి, జూలై 14
సత్తుపల్లి, జూలై 14 : అన్ని వ్యాధుల రోగుల కంటే కిడ్నీ వ్యాధి బాధిత రోగుల పరిస్థితి మరింత దైన్యం. వారి ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త సంక్లిష్టం. వ్యాధి తీవ్రతను బట్టి వారానికోసారో, పక్షానికోసారో, నెలకోసారో వాళ్లు రక్తశుద్ధి చేయించుకుంటూ ఉండాలి. రక్తశుద్ధి కేంద్రాలు తగినంత దూరంలో లేకపోవడం, ఉన్నవాటిల్లో ఎక్కువమంది రోగులు ఉండడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రక్తశుద్ధి చేయించుకోవడంలో ఏ మాత్రం ఆలస్యమైనా వారి ఆర్యోగం మరింత ప్రమాదకరంగా మారుతుంటుంది. అందుకని వీరి ఆరోగ్య పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. రోగుల సమీప ప్రాంతాల్లోనే ఉంటూ వారికి ఊపిరి పోస్తూ వారి ఆయుష్షును పెంచుతోంది. పైగా వారు ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్పాస్, ఒక్కో రోగికి రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ వంటివి అందిస్తోంది. డయాలసిస్ కేంద్రాల విస్తరణలో భాగంగా భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోనూ త్వరలో రక్తశుద్ధి కేంద్రం అందుబాటులోకి రానుంది.
తప్పిన దూరాభారం ప్రయాస..
గతంలో ఉమ్మడి జిల్లాలోని కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే జిల్లా కేంద్రాలకో, లేక హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకో వెళ్లేవారు. పేదలు అంత ఖర్చు భరించి అంతంత దూరం వెళ్లలేక ప్రాణాలు కూడా వదులుకునే పరిస్థితులు ఉండేవి. ఈ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించేందుకు సర్కారు దవాఖానల్లోనే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు బాసటగా నిలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 డయాలసిస్ కేంద్రాల ద్వారా రోగులకు సేవలందిస్తున్నారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో 22 యంత్రాల ద్వారా 150 మందికి, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 5 యంత్రాల ద్వారా 50 మందికి, కొత్తగూడెంలో 5 యంత్రాల ద్వారా 50 మందికి, భద్రాచలంలో 10 యంత్రాల ద్వారా 82 మందికి, మణుగూరులో 5 యంత్రాల ద్వారా 18 మందికి, ఇల్లెందులో 5 యంత్రాల 10 మందికి సేవలందిస్తున్నారు. ఇవేగాకుండా ఖమ్మంలోని మరో రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా మరో 150 మంది రోగులు డయాలసిస్ సేవలు పొందుతున్నారు. దీనికితోడు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో మరో వారం రోజుల్లో ఐదు పడకలతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 500 మందికి పైగా రూపాయి ఖర్చులేకుండా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు.
కిడ్నీ రోగులకు వరం.. డయాలసిస్ కేంద్రం..
సత్తుపల్లిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో మాకు వ్యయప్రయాసలు తప్పాయి. ప్రైవేటు ఆసుపత్రిలో ఒక్కసారి డయాలసిస్ చేయించుకోవాలంటే రూ.4 వేలకు పైగా ఖర్చవుతోంది. నేను అన్నపురెడ్డిపల్లి నుంచి సత్తుపల్లి డయాలసిస్ కేంద్రానికి వచ్చి వారానికి మూడుసార్లు రూపాయి ఖర్చులేకుండా డయాలసిస్ చేయించుకుంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి మాలాంటి కిడ్నీ రోగులను ఆదుకుంటున్నారు. ఆసరా పింఛనుతోపాటు ఉచితంగా బస్పాస్ అందిస్తున్నారు.
– పాడ్యా లక్ష్మణరావు, కిడ్నీ బాధితుడు, అన్నపురెడ్డిపల్లి,భద్రాద్రి జిల్లా
మూడేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నా..
నాకు మూడేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి సోకింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకుంటే డయాలసిస్ చేయాలని చెప్పారు. డయాలసిస్ అంటే ఖర్చుతో కూడుకున్న విషయం. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఉందని తెలుసుకుని ఆ కేంద్రంలో చేరాను. వారానికి మూడుసార్లు ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నా. వైద్యులు కిడ్నీ వ్యాధి బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాకు పింఛను కూడా అందిస్తోంది.
– బంటు గోపి, గొల్లగూడెం, దమ్మపేట మండలం, భద్రాద్రి జిల్లా
దూరం వెళ్లే కష్టాలు తప్పాయి..
నాకు కిడ్నీ సంబంధిత వ్యాధి సోకి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే స్థోమత లేదు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో దూరం వెళ్లే కష్టాలు తప్పాయి. వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారు. నాలాంటి ఎందరో కిడ్నీ వ్యాధి బాధితులకు ప్రభుత్వం ఉచిత డయాలసిస్తోపాటు ఆసరా పింఛన్ అందిస్తూ భరోసా కల్పిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– రామినేని రమేశ్, రామన్నపాలెం, వేంసూరు, ఖమ్మం జిల్లా
అందుబాటులో మెరుగైన సేవలు..
కిడ్నీ బాధితులకు అందించే వైద్యంలో ఎక్కడా రాజీపడడంలేదు. చికిత్స కోసం వచ్చిన వారికి సిబ్బంది అత్యాధునిక పరికరాలతోడయాలసిస్ సేవలు అందిస్తున్నారు. అలాగే వారికి కావాల్సిన ఈపీవో, ఐరన్ ఇంజక్షన్లు కూడా ఉచితంగానే అందిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
-కే.వెంకటేశ్వర్లు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, సత్తుపల్లి