కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 21: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. బుధవారం నుంచి ఈ నెల 24 వరకూ మేడారంలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొనేందుకు, అమ్మవార్లను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తజనులందరూ కుటుంబ సమేతంగా కదిలి వెళ్తున్నారు. మేడారం మార్గంలో గడిచిన రెండు రోజులుగా భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. కాగా, మేడారం వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో ఆ బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. కొత్తగూడెం బస్టాండ్ ప్రాంగణం భక్తులతో కిక్కిరిస్తోంది. కాగా, మేడారం వెళ్లే భక్తులకు ఆర్యవైశ్య సంఘం బాధ్యులు కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో బుధవారం అల్పాహారం పంపిణీ చేశారు. మేడారం జాతర బుధవారం నుంచి మొదలు కావడంతో పట్టణంలోని రామాటాకీస్ ఏరియాలో ఉన్న గద్దెల వద్ద బుధవారం రాత్రి సందడి నెలకొంది. మినీ మేడారాన్ని తలపించే విధంగా వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గద్దెపైకి చేరిన సారలమ్మ తల్లిని దర్శించుకున్నారు.
మణుగూరు టౌన్, ఫిబ్రవరి 21: మండలంలోని తోగ్గూడెంలో మినీమేడారంగా పేరుపొందిన శ్రీసమ్మక్క-సారలమ్మ వనదేవతల జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. భక్తుల సౌకర్యార్థం సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా సహకారంతో ఆలయకమిటీ చైర్మన్ ఊకే వీరయ్య ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మండే మెలుగుట కార్యక్రమంతో ప్రారంభమైన జాతర సమీపంలోని రథంగుట్ట నుంచి అటవీ మార్గంలో మేళతాలాలు, నృత్యాలు, ఆదివాసీల సంప్రదాయాల నడుమ సారలమ్మను బుధవారం గద్దెల వద్దకు చేర్చారు. గురువారం సమ్మక్క తల్లి ఆలయం గద్దెల వద్దకు చేరుకొని భక్తుల పూజలు అందుకున్న తర్వాత 24న వనత దేవతలు వన ప్రవేశం చేయనున్నారు. మినీమేడారం జాతరలో పర్సిక రాజమ్మ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తుండగా.. సహాయ పూజారులుగా పర్సిక గోపమ్మ, మడకం ఇర్మయ్య వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ సతీశ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బుధవారం మణుగూరు తహసీల్దార్ మినీమేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మణుగూరు ఆర్యవైశ్యసంఘం, వాసవీక్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇల్లెందు రూరల్, ఫిబ్రవరి 21 : మండలంలోని సంజయ్నగర్ కార్మిక వాడల్లో కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మ వనదేవతలకు బుధవారం సింగరేణి ఏరియా జీఎం జాన్ ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. జాతర కార్మిక వాడలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎస్వోటు జీఎం మల్లారపు మల్లయ్య, డీజీఎం పర్సనల్ జీ.వి.మోహన్రావు, సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు డేరంగుల పోశం, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, ఫిబ్రవరి 21 : మండలంలోని బొజ్జాయిగూడెం ఆటవీ సమీపంలోని సామ్మక్క-సారలమ్మకు మొదటి రోజు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. బుధవారం అమ్మవార్లను దర్శించుకునేందకు భక్తులు సూదర ప్రాంతాల నుంచి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ, పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేశారు.