Kothagudem | పునర్విభజనతో కొత్తగూడెం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లాగా మారిందే తడవుగా తెలంగాణ ప్రభుత్వం పాలనను మన్యం ప్రజల దరిచేర్చింది. ప్రత్యేక వనరులను సమకూర్చింది. కొత్త కలెక్టరేట్తో సహా మెడికల్, నర్సింగ్ కళాశాల, జడ్పీ కార్యాలయంతోపాటు కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. అనతి కాలంలోనే ఇంతటి అభివృద్ధి జరిగిందంటే అది సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే సాధ్యమైందని చెప్పొచ్చు. నేటితో ఏడేళ్ల మైలురాయి దాటిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై కథనం.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : జిల్లా ఆవిర్భవించిందే తడవుగా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోంది. పునర్విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతూ.. ప్రధాన శాఖల కార్యాలయాలకు కోట్లాది రూపాయలతో కొత్త భవనాలు నిర్మిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి కళ్లముందే ఆవిష్కృతమైంది. ఉమ్మడి జిల్లాలో చిట్ట చివరి మండలాలతో నెట్టివేసిన గ్రామాలు కొత్త జిల్లాతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయంటే అది సీఎం కేసీఆర్ ఘనతే అని చెప్పొచ్చు. సరిగ్గా తెలంగాణ సిద్ధించిన రెండేళ్లకే 2016, అక్టోబర్ 10వ తేదీన జిల్లాల పునర్విభజన జరగడంతో కొత్తగూడెంను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా మార్పు చేశారు.
దీంతో ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో సేవలు పొందిన మన్యం వాసుల సమస్యకు చరమగీతం పలికినైట్లెంది. ఉమ్మడి పాలనలో దూరమైన పాలన నేడు జిల్లా ప్రజలకు చేరువైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా జిల్లాకు రావాల్సిన నిధులు, నియామకాలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు దగ్గరయ్యాయి. కొత్త కలెక్టరేట్తోపాటు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల, జడ్పీ కార్యాలయంతోపాటు కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేయడంతో మన్యానికి మహర్దశ పట్టినైట్లెంది. ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువైంది. నాడు కలెక్టర్ దగ్గరకు వెళ్లాలంటే ఖమ్మం జిల్లాకు వెళ్లి రెండు రోజులు అక్కడ ఉంటే తప్ప వెసులుబాటు ఉండేది కాదు. నేడు కలెక్టర్ను కలవాలంటే కేవలం గంటల వ్యవధిలోనే అధికారులను కలిసి సమస్యలను చెప్పుకుని పరిష్కరించుకునే అవకాశం వచ్చింది.
మారిన రూపురేఖలు..
కొత్త జిల్లా, జిల్లా కేంద్రాన్ని రూపురేఖలు మార్చివేసింది. వ్యాపార, రాజకీయ పరంగా అభివృద్ధి చెందడంతో కొత్తరూపును సంతరించుకున్నది. అధికార కార్యాలయాలతోపాటు కొత్తగా వచ్చిన ఉద్యోగులు, రెస్టారెంట్లు, హోల్సేల్ వ్యాపారాలు, కార్పొరేట్ వైద్యం, ప్రైవేటు విద్యాలయాలు పెరగడంతో వ్యాపార రంగం మరింత వేగంగా పుంజుకుంది. కొత్త జిల్లా ఏర్పాటుతో కిన్నెరసాని పర్యాటక ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. జిల్లా కేంద్రంలో ఫారెస్టు అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడంతో దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు విహార యాత్రకు వస్తున్నారు.
కొత్తగా ఏర్పాటైన కార్యాలయాలు
నిర్మాణంలో ఉన్న కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఫారెస్టు అర్బన్ పార్క్, కిన్నెరసాని టూరిజం, బడ్జెట్ హోటల్, కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా ప్రధాన ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, సఖి సెంటర్, జడ్పీ కార్యాలయం ఉన్నాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. సాగు, తాగునీరు సౌకర్యం మెరుగుపడేందుకు మిషన్ కాకతీయ చెరువులు, మిషన్ భగీరథ నీటి పథకం, జిల్లా మత్స్య శాఖ కార్యాలయం రావడంతో ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ ఇక్కడి నుంచే చేపడుతున్నారు.
కొత్తగా ఆరు మండలాలు
జిల్లా ఏర్పాటుతోపాటు కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, గుండాల, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాలను ఏర్పాటు చేశారు. అక్కడ కొత్త కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు కొత్త పోలీస్స్టేషన్లు వచ్చాయి. ప్రతీ మండలానికి రైతు వేదికలు, కొత్త పంచాయతీల ఏర్పాటుతో పంచాయతీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టారు.
కొత్త మండలమైంది..
కొత్త మండలం అయ్యాక చాలా సమస్యలు తగ్గాయి. అప్పుడు కొత్తగూడెం వెళ్ల్లాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా దగ్గరగా ఆఫీసులన్నీ ఇక్కడే ఉన్నాయి. భూములకు రేట్లు బాగా పెరిగి పోయాయి. సింగభూపాలెం చెరువు అభివృద్ధి జరిగింది. పంటలు బాగా పండుతున్నాయి. రైతు వేదికలు కట్టారు. రైతుల సమావేశాలు పెట్టుకోవాలంటే అవకాశాలు మెరుగుపడ్డాయి.
– గుగులోత్ మంగ్యా, రైతు, కొత్త అంజనాపురం
ప్రజలకు మేలు జరిగింది
ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు చర్ల నుంచి ఖమ్మం వెళ్లాలంటే ముందు రోజు రాత్రి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఉదయం 6 గంటలకు వస్తే చాలు ప్రజావాణికి వచ్చి సమస్యను చెప్పుకుని వెళ్లొచ్చు. జిల్లా కేంద్రం అందరికీ దగ్గరైంది. కలెక్టరేట్లోనే అన్ని కార్యాలయాలు కలిపి ఉండడం వల్ల అధికారులంతా ఒకేచోట ఉంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల వారికి సమస్య తప్పింది.
– విజేత, జిల్లా సంక్షేమాధికారి
రైతులకు చాలా ఉపయోగం
గతంలో జిల్లా లేనప్పుడు కేవీకే ఇక్కడ లేదు. వైరాలో ఉండేది. ఇప్పుడు జిల్లా కేంద్రానికి కృషి విజ్ఞాన కేంద్రం అందుబాటులోకి వచ్చింది. రైతుల పంటలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అక్కడకు వెళ్లి తగు జాగ్రత్తలు చెబుతున్నాం. ఎరువుల రవాణా కూడా తగ్గింది. హోల్సేల్ షాపులు కూడా జిల్లా కేంద్రంలో ఉన్నాయి. చర్ల, దుమ్ముగూడెం ప్రజలకు దూరాభారం బాగా తగ్గింది. జిల్లా ఏర్పాటు రైతులకు చాలా ఉపయోగపడింది.
– లక్ష్మీనారాయణమ్మ, కేవీకే కోఆర్డినేటర్
చాలా మార్పులు వచ్చాయి
తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్ ఏది చేసినా ప్రజల కోసమే. గిరిజన జిల్లా ప్రజలకు అందుబాటులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. పెద్దాస్పత్రి వచ్చింది.. ఆరోగ్య సమస్యలు తీరిపోయాయి. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. కొత్త మండలాలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడి ప్రజలకు దూరాభారం తగ్గింది. ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారమయ్యాయి.
– మండే వీరహన్మంతరావు, సొసైటీ చైర్మన్