కల్లూరు, జనవరి 31: గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ఒక్కో మండల ప్రాదేశిక నియోజకవర్గానికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను కల్లూరు రైతువేదికలో మంగళవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదల కుటుంబాల్లో ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఈ పథకాలు ఎంతో గొప్పవని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10 వేల మంది యువతులకు ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని అన్నారు. అలాగే సీఎంఆర్ఎఫ్ కూడా నియోజకవర్గంలో అనేక మందిని ఆదుకున్నదని అన్నారు.
మండలంలో 15 కమ్యూనిటీ హాళ్లు మంజూరయ్యాయని, ఒక్కో కమ్యూనిటీ హాలుకు రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు బాబ్జీ ప్రసాద్, రవికుమార్, బీరవల్లి రఘు, కట్టా అజయ్కుమార్, పాలెపు రామారావు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, ఇస్మాయిల్, బోబోలు లక్ష్మణ్రావు, కొండూరి కిరణ్, కమ్లీ పాల్గొన్నారు.
తల్లాడ మండలంలో..
తల్లాడ, జనవరి 31: పేదల పాలిట వరంలా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో భరోసానిస్తోందని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, రవీందర్రెడ్డి, శీలం కోటారెడ్డి, కోసూరి వెంకటనరసింహారావు, పాలెపు రామారావు, బొడ్డు వెంకటేశ్వర్లు, జీవీఆర్, గుండ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.