ఖమ్మం, మార్చి 25 : సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులు మంజూరు చేయడం వల్లే ఖమ్మం నగరాభివృద్ధి జరిగిందని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా ‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ‘వాడవాడకు పువ్వాడ’లో భాగంగా శనివారం నగరంలోని 14వ డివిజన్ పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఇంటింటికీ నేరుగా వెళ్లి ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, మురికికాలువ సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా పనులను తక్షణమే పరిషరించాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభిని మంత్రి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న సైడ్ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరమైతే కొత్త కాల్వలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వృద్ధుల పింఛన్లు, డ్రెయిన్లు తదితర సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీన వాడవాడ కార్యక్రమం చేపట్టామని అప్పటి నుంచి ప్రతి వారం ఖమ్మం కార్పొరేషన్లో ఏదో ఒక డివిజన్లో కార్యక్రమం కొనసాగిస్తూనే ఉందని అన్నారు. కార్పొరేషన్ బడ్జెట్లో ప్రతి డివిజన్కు రూ.50 లక్షలు కేటాయించామని వాటితో పూర్తిగా సైడ్ కాలువల నిర్మాణం చేపట్టామన్నారు. కార్యక్రమంలో నగర్ మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్ కురాకుల వలరాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, మున్సిపల్ ఈఈ క్రిష్ణ లాల్, డీఈ ధరణి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, విద్యుత్ ఏడీఈ రమేశ్, తహసీల్దార్ శైలజ, నాయకులు దేవభక్తుని కిశోర్బాబు, ఆళ్ల అంజిరెడ్డి, కన్నం ప్రసన్నకృష్ణ , ఆర్ఐ రమేశ్, నాగేశ్వరరావు, షకీనా, సురేశ్, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికి సీపీఆర్పై అవగాహన అవసరం – మంత్రి పువ్వాడ
మామిళ్లగూడెం, మార్చి 25 : ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్న వారిని సీపీఆర్ చేయడం ద్వారా రక్షించవచ్చని, ప్రతి ఒకరూ సీపీఆర్పై అవగాహన కలిగి ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. శనివారం ఐడీవోసీలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి స్వయంగా సీపీఆర్ ప్రక్రియ ఎలా చేపట్టాలో చూపి అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారడంతో ప్రపంచవ్యాప్తంగా సడన్ కార్డియాక్ అరెస్టులు, ఆకస్మిక గుండెపోటులు పెరిగాయని, గుండెపోటుకు గురైన వారికి వెంటనే కారియో పల్మనరీ రీసిటేషన్(సీపీఆర్) చేయగలిగితే ప్రాణాపాయం తప్పే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఫ్రంట్ లైనర్స్కు శిక్షణ ఇవ్వడం ద్వారా కొందరి ప్రాణాలైనా కాపాడవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. సీపీఆర్ దశలపై కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రూపొందించిన పోస్టర్ను ఆవిషరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, జడ్పీ సీఈవో అప్పారావు, డీఎంహెచ్వో బి.మాలతి, జిల్లా అధికారులు, వైద్యాధికారులు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు