ఎర్రుపాలెం, మార్చి 3: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి రాష్ట్ర బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భవానీపురం- కాచవరం వరకు రూ.16 కోట్ల నిర్మించనున్న బీటీ రోడ్డు, భీమవరం -గోసవీడు వరకు రూ.15 కోట్లతో రోడ్డు, బ్రిడ్జి, అయ్యవారిగూడెం -బుచ్చిరెడ్డిపాలెం వరకు రక్షణగిరి రోడ్డుకు రూ.6.5 కోట్ల వ్యయంతో బీటీరోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
తమ ప్రభుత్వం వందకు వందశాతం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపునే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. టీఎస్ఎస్ఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలన్నింటినీ ఒకేచోట నిర్మిస్తామన్నారు. అందరికీ కామన్ ప్లే గ్రౌండ్స్, ల్యాబ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, నాయకులు సుధాకర్రెడ్డి, కృష్ణారెడ్డి, యరమల పూర్ణచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నరసింహారావు, గోవర్థన్రెడ్డి, నాగిరెడ్డి, గంటా తిరుపతమ్మ, లక్ష్మణరావు పాల్గొన్నారు.