భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)/ రామవరం: సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయ మార్గమని, ఈ విద్యుత్తుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ నూతన విద్యుత్ పాలసీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియాలోని రామవరంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో కార్మికులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 80శాతం కొలువులు స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే పాలసీని అమలు చేస్తామన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు.
రానున్న రోజుల్లో ప్రభుత్వ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణీయుల సమస్యలు పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సోలార్ విద్యుదుత్పత్తిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం ఓపెన్కాస్టుల్లో ఓవర్ బర్డెన్ తీసిన తర్వాత అక్కడ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం హైపవర్ కమిటీ వేతనాలను చెల్లించాలన్నారు.
సింగరేణీయులు, విశ్రాంత సింగరేణీయుల సొంతింటి కలను నెరవేర్చాలన్నారు. ఏరియాల పరిధిలోని శాసన సభ్యులను కలుపుకొని యాజమాన్యం పని చేయాలని విజ్ఞప్తి చేశారు. శాసనాలు చేయాలన్నా, చట్టాలుచేయాలన్నా శాసన సభ్యులతోనే అవుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్నాయక్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, మట్టారాగయి, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, డైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యనారాయణరావు, డైరెక్టర్ పీపీ వెంకటేశ్వరరెడ్డి, జీఎం (సోలార్) జానకీరామ్, జీఎం (సీపీపీ) జక్కం రమేశ్, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజు, జీఎం (సివిల్) టి.సూర్యనాయణ, ఎస్వోటూ జీఎం కోటిరెడ్డి, ఏజీఎం ఈఅండ్ఎం దుర్గాప్రసాద్, ఏజీఎం సివిల్ రామకృష్ణ, ఎస్ఈ ఈ అండ్ఎం శ్రీకాంత్, పర్సనల్ మేనేజర్ శివకేశవరావు పాల్గొన్నారు.