నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 22 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కూసుమంచి, వేంసూరు, వైరా, అశ్వారావుపేట, దమ్మపేట, ఇల్లెందు, కరకగూడెం, మణుగూరు మండలాల్లో వీవోఏలు శుక్రవారం ఐకేపీ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టారు.
నిరవధిక సమ్మెలో భాగంగా పలువురు వీవోఏలు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 363/2025, జీవో 302/2022 ప్రకారం పలు అంశాలను ఇంకా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవోఏలకు తగిన వేతనాలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీవోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, రూ.20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, ట్యాబ్లు అందజేయాలని కోరారు. లేదంటే ఐకేపీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మణుగూరు టౌన్ : సమ్మెలో పాల్గొన్న ఐకేపీ వీవోఏలు

కూసుమంచిలో సమ్మెలో పాల్గొన్న వీవోఏలు

వైరాటౌన్ : సమ్మె చేస్తున్న వీవోఏలు

ఇల్లెందు : నిరసన తెలుపుతున్న వీవోఏలు