ఇల్లెందు రూరల్, మార్చి 19: ‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసిచూడు’ అన్నారు పెద్దలు. అంటే ఆ రెండు విజయవంతంగా పూర్తి చేయడం అంతకష్టమని పెద్దల భావన. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్లి చేయడం సులభమేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం కష్టతరంగానే ఉంది. అందుకు ప్రధాన కారణం డిమాండ్ తగినంత ఇసుక లభించకపోవడమే. భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సులభంగా దొరికే ఇసుక ఇప్పుడు ఏ విధంగా ప్రయత్నించినా దొరకని దుస్థితి. దీనిని అదునుగా తీసుకున్న దళారులు సిండికేట్గా మారి ఇసుక ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో ఇంటి యజమానులు ఇల్లు కట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులపైనా పడుతున్నది. పనులు సక్రమంగా సాగక వారి ఉపాధి దెబ్బతింటున్నది.
గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.2వేల నుంచి రూ.3 వేల లోపు ఉండేది. కానీ ఇప్పుడు అక్రమార్కులు ట్రాక్టర్ ఇసుకను రూ.6 వేల నుంచి రూ.7 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో ఇంటి యజమానులపై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అదనపు భారం పడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో సర్కారే ఇసుక విక్రయాలను నియంత్రించేంది. ఎవరికైనా ఇసుక కావాలంటే ఆన్లైన్ బుక్ చేసుకుంటూ రెవెన్యూశాఖ అధికారులు అప్రూవల్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీని రూపొందించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరు ఇంటి యజమానులు మాత్రం ఎలాగో నిర్మాణం మొదలుపెట్టాం.. ఇక ఎక్కువ ధరకైనా ఇసుక కొని పూర్తి చేద్దామనుకుంటున్నారు. దళారులను ఆశ్రయించి సుదూర ప్రాంతాల్లోని ఇసుక రీచ్ల నుంచి ఇసుక తెప్పించుకుంటున్నారు. మరికొందరు నాసిరకం ఇసుకను కొనుగోలు చేసి నష్టపోతున్నారు. సాధారణంగా ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లు నిర్మించాలంటే ఇంటి యజమానులు టేకులపల్లి, కాచనపల్లి, గుండాలలోని స్థానిక రీచ్ల నుంచి ఇసుక తెప్పించుకునేవారు. కానీ ఇప్పుడు కిన్నెరసాని, భద్రాచలం నుంచి అధిక రేట్లకు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఇసుకను కొనుగోలు చేయలేని పేదలు ఇప్పుడు కట్టడాలకు రాయిపొడి (డస్ట్) వాడుతున్నారు. దీంతో నిర్మాణం వ్యయం తగ్గుతుంది కానీ ఇల్లు పదికాలాల పాటు నిలువడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, ఇసుక పాలసీ రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంటి నిర్మాణానికి ఇసుక తప్పనిసరి. మా కుటుంబం ప్రస్తుతం పూర్వీకులు కట్టిన ఇంట్లోనే ఉంటుంది. నేను ఇల్లు కడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ ఇప్పటి ఇసుక ధరలను చూస్తే భయం వేస్తున్నది. గతంలో సులభంగా ఇసుక లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సులభంగా ఇసుక అందేది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఆన్లైన్ విధానం రద్దయింది. దీంతో ఇండ్లు నిర్మించుకోవడం కష్టతరమైంది. ఇప్పుడు దళారులదే రాజ్యమైంది. వారు చెప్పిన ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి యజమానులు రెట్టింపు ధరలకు ఇసుక కొని ఇల్లు కట్టుకునే దుస్థితి ఏర్పడింది.