ఖమ్మం రూరల్, డిసెంబర్ 1 : చలి పులి జిల్లాపై పంజా విసురుతోంది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఉదయం, రాత్రివేళల్లో జనం రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు, కూలీలు అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, ఆస్తమా తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. మరో నెల రోజులపాటు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండగా.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, శరీరానికి ఎండ తగిలే విధంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో సంభవించిన పెనుమార్పుల కారణంగా పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా జిల్లా ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. ఉదయం 10 గంటలైనా చలి ఏమాత్రం తగ్గడం లేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచే మబ్బులతో చల్లని గాలులు వీస్తుండడం.. సాయంత్రం 6 గంటల నుంచే మంచు కురుస్తుండడంతో చలి తీవ్రత ఎక్కువవుతోంది.
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతున్నాయి. దీనినిబట్టి జిల్లాలో చలి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక పల్లెల్లో చలి తీవ్రత వల్ల చిన్నారులు, వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇళ్ల వద్ద దుప్పట్లు కప్పుకొని చలి మంటలు కాగుతున్నారు. అంతేకాక ఖమ్మంతోపాటు ఇతర మున్సిపాలిటీల పరిధిలో వ్యాపార దుకాణాలు సైతం రాత్రి 8 గంటలకే మూతపడుతున్నాయి. చిరు వ్యాపారులు రాత్రి 7 గంటలకే వ్యాపారాన్ని ముగించుకొని ఇంటిబాట పడుతున్నారు.
భారీ వర్షాలు కురిసినా, పిడుగులు పడినా విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు, ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సిందే. ప్రస్తుతం జిల్లాపై చలి పులి పంజా విసురుతుండడంతో ఉదయాన్నే పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు, విధుల నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు సైతం ఉదయాన్నే పనులకు వెళ్లలేక సతమతమవుతున్నారు. చిరు వ్యాపారులు సూర్యుడు కనిపిస్తే తప్ప రోడ్లపైకి రావడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో చలి నేస్తాలుగా పేరున్న రక్షణ కవచాల(రగ్గులు, మఫ్లర్లు, స్వెటర్ల)కు గిరాకీ పెరిగింది. ఖమ్మం, సత్తుపల్లి, మధిర తదితర పట్టణాల్లో నేపాల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఉన్ని దుస్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందేందుకు వాటివైపు పరుగులు పెడుతున్నారు. కొంచెం ఖరీదైనా ఏమాత్రం వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నారు.