అశ్వారావుపేట/ దమ్మపేట, ఆగస్టు 1: దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికే టీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులంతా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అశ్వారావుపేట మండలానికి మంజూరైన దళితబంధు యూనిట్లను స్థానిక గిరిజన భవన్ వద్ద సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముందుగా పట్టణంలో ఈ పథకం కింద ఏర్పాటు చేసిన దుకాణాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకం అందుతుందని, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు చిన్నంశెట్టి వరలక్ష్మి, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, చిట్లూరి ఫణీంద్ర, చిన్నంశెట్టి సత్యనారాయణ, వెంకట ముత్యం, సీతారాంనాయక్, విద్యాధర్రావు, వెంకట నరసింహం, బిర్రం వెంకటేశ్వరరావు, మందపాటి రాజమోహన్రెడ్డి, సత్యవరపు సంపూర్ణ, కొల్లు వెంకటరమణ, జీ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేటకు 31 యూనిట్లు..
దమ్మపేట మండలంలో రూ.3.10 కోట్లతో 31 యూనిట్లను మంజూరైనట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. దమ్మపేట రైతువేదిక వద్ద సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితులందరూ ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకమే కారణమన్నారు. అనంతరం నాచారం గ్రామానికి చెందిన వేముల ఝాన్సీ మాట్లాడుతూ.. దళితబంధు ద్వారా తాను ఫ్యాన్సీ దుకాణం ఏర్పాటు చేసుకున్నానని అన్నారు. ఈ పథకం ద్వారా తనను ఆదుకున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, దారా మల్లికార్జునరావు, ఉయ్యాల చిన్నవెంకటేశ్వరరావు, దారా యుగంధర్, దొడ్డాకుల రాజేశ్వరరావు, సోయం ప్రసాద్, దొడ్డా రమేశ్, గాజుబోయిన ఏసుబాబు, సీతారాంనాయక్, జీ.ముత్యం, చంద్రశేఖర్, స్వామి, కృష్ణ, రావు జోగేశ్వరరావు, దీప్తి, చిన్నంశెట్టి యుగంధర్, యార్లగడ్డ బాబు, పగడాల రాంబాబు, పానుగంటి చిట్టిబాబు, పసుమర్తి సుదర్శనరావు, అంకత ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల కాపాడుకుంటాం..
వర్షాకాలంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. దమ్మపేట పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఉయ్యాల చిన్నవెంకటేశ్వరరావు సమక్షంలో పారిశుధ్య కార్మికులు, ప్రజలకు దుస్తులు, చెత్తబుట్టలను సోమవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.