కారేపల్లి : ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కారేపల్లి మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్బంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటిని అమలు చేయడం మరిచారని అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సాకుగా చూపి వాగ్దానాలను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూడడం సరికాదని ఆయన తెలిపారు.
ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వందృష్టి సారించాలని, బడ్జెట్తో నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు కోరారు. మహిళలకు ఇస్తామని చెప్పిన నెలకు రూ.2500, వృద్ధాప్య, వితంతు పెన్షన్ రూ.4 వేలు, వికలాంగులకు రూ. 6 వేలు, కల్యాణలక్ష్మి.. షాదీ ముబారక్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రూ.500, వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద రూ.12 వేలు, రైతులకు రుణమాఫీతో పాటు పెండింగులో ఉన్న రైతు భరోసా విడుదల చేయాలని నాగేశ్వరరావు ప్రభుతాన్ని కోరారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు, విద్యా, వైద్య రంగాన్ని మెరుగుపరచటం ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనాలని సీఎంకు ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక భూమిక పోషిస్తున్న స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేసి, కనీస వేతనం అమలు చేయాలని నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. అలాకాకుండా హామీలు వేగవేతకు ప్రయత్నిస్తే ప్రజలను సమీకరించి ఆందోళన చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కమిటీ మండల నాయకుల ముండ్ల ఏకాంబరం, కొండబోయిన ఉమావతి, తలారి దేవ ప్రకాష్, అన్నారపు కఅష్ణ, పాసిని నాగేశ్వరరావు, కరకపల్లి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.