చింతకాని, మార్చి 23: కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోదీ, అమిత్ షా కలిసి దేశాన్ని అమ్ముతున్నారని, సంపదను కొల్లగొడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర.. మండలంలోని నాగులవంచ గ్రామానికి గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. ఇప్పటికే నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువకే కార్పొరేట్ సంస్థలకు అమ్మేశారని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తే దేశాన్ని తాకట్టు పెట్టినా ఆశ్చర్యం లేదని అన్నారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు రాజకీయం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూ వెళ్తున్నదని, ఈ భారాన్ని నిరుపేద, మధ్యతరగతి వర్గాలు భరించలేకపోతున్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ విముక్త భారత దేశం కోసం రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్తామన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మండల కార్యదర్శి గోపాలరావు, జడ్పీటీసీ సభ్యుడు పర్చగాని తిరుపతి కిశోర్, నాయకులు సామినేని రామారావు, వంకాయలపాటి సత్యనారాయణ, వత్సవాయి జానకిరాములు పాల్గొన్నారు.