ఖమ్మం, మార్చి 3 : పదేళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని, పాలనలో నియంతృత్వం వచ్చేసిందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ అగ్రనేత ప్రదీప్సింగ్ ఠాగూర్ అన్నారు. సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ (ఎం.ఎల్), సీపీఐ (ఎం.ఎల్) ఆర్.ఐ పార్టీలన్నీ కలిసి సీపీఐ (ఎం.ఎల్) మాస్లైన్గా ఏర్పడిన సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విప్లవ పార్టీలు చేసిన తప్పిదాలను ఇప్పటికే గుర్తించాయని, ఆ తప్పిదాలను సరిచేసుకునేందుకే ఒక్కటయ్యాయన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై మున్ముందు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు.
వామపక్ష పార్టీల్లో చీలికల కారణంగా ఉద్యమాలు బలహీనమయ్యాయన్నారు. నేడు వామపక్షవాదులందరూ ఒక్కటై ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై గొంతెత్తిన వారిపై రాజ్యాంగ వ్యవస్థలను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి సిద్ధమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.
దేశంలో విప్లవ పార్టీల ఐక్యత జరగాలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఫాసిస్టు విధానాలపై మరిన్ని పోరాటాలు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బహిరంగ సభల నిర్వహణ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హిట్లర్ వారసుడని, ఆయన సెక్యులర్ శక్తులను అణచివేస్తున్నారని మండిపడ్డారు. మణిపూర్లో మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రధాని మోదీ నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. ఢిల్లీలో మద్దతు ధర కోసం రైతులు పోరాడుతుంటే వారికి భరోసాగా మోదీ ఒక్క హామీ ఇవ్వలేకపోతున్నారన్నారు. కార్యక్రమాల్లో నాయకులు సుభాల్ దేవ్, సంజయ్ సింఘ్వీ, ధినిష్ గోహైన్, కెజీ రాంచందర్, కె.రమ, ఆర్.చంద్రశేఖర్, గుమ్మడి నర్సయ్య, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పూజారి, జీవన్కుమార్, రవిబాబు, నెటార్, త్రివేది పాల్గొన్నారు.
బహిరంగ సభకు ముందు నాయకులు ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పటేల్ మైదానం నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు పెవిలియన్ గ్రౌండ్కు ప్రదర్శనగా వచ్చారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, ఎర్ర జెండాలతో నగరం ఎరుపెక్కింది. ప్రధాని మోదీ, కార్పొరేట్ శక్తుల విధానాలకు సంబంధించిన నృత్యరూపకాలు నగరవాసులను ఆకట్టుకున్నాయి.