నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 8 : కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. విభజన చట్టంలోని హక్కులు అమలు కాలేదు. మళ్లీ ఉత్త చేతులతో తెలంగాణలో పర్యటించిన మోదీపై జనాగ్రహం పెల్లుబికింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శనివారం హైదరాబాద్ వచ్చిన ప్రధానికి నిరసన సెగ తగిలింది. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. నల్ల జెండాలు, బ్యాడ్జీలు, దుస్తులు ధరించి వినూత్న నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.
తెలంగాణలో పర్యటించే అర్హత ప్రధాని మోదీకి లేదని బీఆర్ఎస్, వామపక్షాల నేతలు స్పష్టం చేశారు. ‘హామీలను తుంగలో తొక్కుతూ రాష్ర్టానికి అడుగడుగునా అన్యాయం చేస్తున్న మోదీ గో బాక్’ అంటూ నినదించారు. తెలంగాణకు వివిధ సందర్భాల్లో ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్ర విభజన చట్ట ప్రకారం దకాల్సిన హకులు, వాటాలను కేంద్రం పట్టించుకోకపోవడం, జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పకపోవడం, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం వంటి చర్యలను నిరసిస్తూ ఆయా పార్టీల నాయకులు శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నల్లజెండాలను ప్రదర్శిస్తూ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలను చేపడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి విభజన చట్ట హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.