ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 1: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటను ఖరీదు చేసే వ్యాపారుల సమ్మె గురువారంతో నాలుగో రోజుకు చేరింది. దీంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తి ఖరీదుదారులు, జీఎస్టీ అధికారుల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు రైతులకు శాపంగా మారాయి. 2017-18లో పత్తి ఖరీదుదారులు తమ జీఎస్టీ పన్నులను పర్చేజ్పై కాకుండా సేల్స్పై చెల్లించడంతో పొరపచ్చాలు వచ్చాయి. సహజంగా పత్తి ఖరీదుదారులు సేల్స్పై కాకుండా పర్చేజ్ ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మళ్లీ పన్ను చెల్లించాలని పత్తి వ్యాపారులకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో వివాదం మొదలైంది.
ఎగుమతిశాఖ వ్యాపారుల విజ్ఞప్తి మేరకు చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు నాలుగు రోజుల క్రితం పత్తి కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నట్లు మార్కెట్ కమిటీకి వినతిపత్రం అందజేశారు. దీంతో యార్డులో పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ యార్డులో క్రయవిక్రయాలు జరుగకపోవడంతో కమీషన్ వ్యాపారులు మార్కెట్ అధికారులకు అభ్యంతరం తెలిపారు. రైతులు ఇతర ప్రాంతాల్లో పంటను విక్రయించుకుంటున్నారని, తద్వారా మాకు రావాల్సిన కమీషన్తోపాటు తమ పెట్టుబడి సొమ్ము తిరిగి వచ్చే అవకాశం లేదంటూ గురువారం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు వద్ద వాపోయారు.
దీంతో వర్తకసంఘం బాధ్యులతో మరోసారి మార్కెట్ కమిటీ పాలకవర్గం సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో పత్తి ఖరీదుదారులు శుక్రవారం రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా జీఎస్టీ ఉన్నతాధికారులను, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును కలిసేందుకు సమాయత్తమయ్యారు. దీంతో శనివారం నుంచి తిరిగి పత్తి యార్డులో క్రయవిక్రయాలు జరిగే అవకాశం ఉందని మార్కెట్ కమిటీ సెక్రటరీ మల్లేశం తెలిపారు.