కొత్తగూడెం క్రైం, మార్చి 21 : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పార్లమెంట్ ఎన్నికలను సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ రోహిత్ రాజు ఏపీ సరిహద్దు పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా సమీక్ష నిర్వహించగా.. ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి సైతం సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద అధికారులు సమన్వయాన్ని పాటిస్తూ.. ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అక్రమ నగదు, మద్యం సరఫరాను నిరోధించేందుకు 12 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 10 అంతర్ జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. 24/7 వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు చేపడుతున్న అన్ని చర్యలను ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. సరైన ఆధారాలు లేకుండా నగదు, మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తూ పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో పాల్వంచ, జంగారెడ్డిగూడెం, పోలవరం డీఎస్పీలు, సరిహద్దు పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.