ఖమ్మం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ పార్టీ వాటినే తమ ఆరు గ్యారంటీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నదని రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు, ఆసరా పింఛన్లను కాపీ కొట్టిన విషయం నిజం కాదా.. అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పింఛనుదారులకు కేవలం రూ.200 పింఛను ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పింఛనును రూ.2,016కు పెంచారన్నారు. దేశంలోనే తొలిసారి రైతుబంధు పథకాన్ని అమలు చేసింది ఒక్క కేసీఆరేనన్నారు. ఇప్పుడు ఎవరు ఏ పథకాన్ని అమలు చేస్తున్నారో రేవంత్రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీములు చిత్తయ్యాయన్నారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా కేసీఆర్ మున్ముందు రాష్ట్రంలో ప్రతి వ్యక్తికీ బీమా సౌకర్యం కల్పిస్తారన్నారు. సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి శషభిషలు లేవన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ గతంలో ఎన్నోసార్లు మెచ్చుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. కరోనా వంటి సంక్షోభం వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకానలు కొనసాగించారని కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014, 2018 ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఫలితాలు ఉండబోతున్నాయని స్పష్టం చేశారు. ఇక్కడి పదికి పది అసెంబ్లీ స్థానాలూ బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
గెలిచిన స్థానాలను పార్టీ అధినేత కేసీఆర్కు కానుకగా ఇస్తామన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమన్నారు. ప్రత్యర్థులు ఇంకా క్యాండెట్లను నిర్ణయించుకునే స్థితిలోనే ఉన్నారని, కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలోనూ దూసుకుపోతున్నారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కదన రంగంలోకి దూకాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందగా ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే లక్షన్నర ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని సీఎం కేసీఆర్ చేసి చూపించారని కొనియాడారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి కమల్రాజు, బీఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి మదన్లాల్, నగర మేయర్ నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ విజయ్కుమార్, నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, వెంకటరమణ పాల్గొన్నారు.