పర్ణశాల, సెప్టెంబర్ 7 : గిరిజన గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా దుమ్ముగూడెం పోలీసులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ ఆధ్వర్యంలో గిరిజనులను చైతన్యపర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. యువతను అన్నిరంగాల్లో ప్రోత్సహిస్తూ నేరాలకు దూరంగా ఉండేలా వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు. వారు అందిస్తున్న సేవలకు ‘శభాష్ పోలీస్’ అంటూ మండల ప్రజలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెం అతిపెద్ద ఏజెన్సీ మండలం. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుని ఆనుకొని ఉన్న ఈ మండలంలో 104 గ్రామాలు ఉన్నాయి. వాటిలో ములకనాపల్లి, కొత్తగుంపు, మానుగట్టు, గద్దమడుగు, సిరిగుండం వలస గొత్తికోయ గిరిజన గ్రామాలు. మారుమూల గిరిజన గ్రామాలతోపాటు వలస గొత్తికోయ గిరిజన గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా గొత్తికోయ గిరిజన గ్రామాలైన ములకనాపల్లి, కొత్తగుంపు, మానుగట్టు, గద్దమడుగు, సిరిగుండంలో సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్ ఆధ్వర్యంలో పోలీసులు సంయుక్తంగా దుప్పట్లు, రగ్గులు, ఇంటి సామగ్రి, నిత్యావసర సరుకులు, సోలార్ లైట్లు లాంటివి పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు చదువుకు దూరమైన బడీడు పిల్లలను గిరిజన వసతి గృహాల్లో చేర్పించి వారికి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
సరైన రహదారులు ఉంటే గిరిజన గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఎల్డబ్ల్యూ నిధుల ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి నేషనల్ హైవేను తలపించేలా రోడ్లను నిర్మించారు. ఆర్లగూడెం నుంచి కొత్తూరు, చిన్న ఆర్లగూడెం నుంచి పెద్ద కమలాపురం, చిన్న నల్లబల్లి నుంచి సుజ్ఞాపురం, పెద్ద నల్లబల్లి నుంచి పైడిగూడెం, సీతానగరం నుంచి పులిగుండాల వరకు బీటీ రహదారుల నిర్మాణంలో పోలీసులదే కీలకపాత్ర. వీటితోపాటు పలు గ్రామాల్లో బీటీ రహదారులు కూడా నిర్మించారు.
మండలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యువకులను చైతన్యపరుస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగంగా నడిపి ప్రాణాలను పోగొట్టుకోవద్దని హితబోధ చేస్తున్నారు. న్యాయ సేవా సదస్సులు నిర్వహించి మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు.
వలస గొత్తికోయ గిరిజన గ్రామాల్లోని ప్రజలు వ్యాధుల బారినపడకుండా వైద్యారోగ్య శాఖ సమన్వయంతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. పారిశుధ్య పనులు చేపడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంత యువతను అన్నిరంగాల్లో చైతన్యపర్చడం పోలీసుల సామాజిక బాధ్యత. ఆ దిశగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం వల్ల గిరిజనులు అన్నిరంగాల్లో ముందుంటారు. గిరిజన యువతకు బంగారు భవిష్యత్తు అందించడమే పోలీసుల లక్ష్యం.
– దోమల రమేశ్, సీఐ, దుమ్ముగూడెం
గిరిజన యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు దుమ్ముగూడెం పోలీసులు ప్రత్యేక చొరవతో ములకపాడు గ్రామంలో ఎనిమిది ఎకరాల్లో సుమారు రూ.2 కోట్లతో మెగా క్రీడా మైదానాన్ని నిర్మిస్తున్నారు. గిరిజన యువతలో క్రీడాస్ఫూర్తిని చూసిన పోలీస్ శాఖ వారిని ప్రోత్సహిస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తారనే ఆలోచనతో గిరిజన గ్రామాల్లో ఉన్న యువకులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. వాలీబాల్ కిట్లు, క్రికెట్, వ్యాయామ కిట్లు కూడా అందిస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ అవగాహన కల్పిస్తూ ప్రతిభ ఉన్నవారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. గిరిజనుల సేకరించిన ఇప్పబద్దను నూనెగా తయారు చేసుకునేందుకు గానుగమిళ్లు అందజేశారు. మండలంలో ఇటీవల పర్యటించిన జిల్లా ఎస్పీ వినీత్ చింతగుప్ప గ్రామంలో సుమారు రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.