పినపాక, అక్టోబర్ 30 : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలోని మ ల్లారం, గోపాలరావుపేట గ్రామాల్లో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కలుసుకొని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వివరించారు. మల్లారం గ్రామంలో 20 కాంగ్రెస్ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరగా.. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఆదరించి ఓట్లు వేయాలని కోరారు.
పినపాక మండలంలో ఐదేళ్లలో వందల కోట్ల నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాలను అభివృద్ధి చేశానన్నారు. రైతుబంధు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ను ఫిర్యాదు చేసిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. రానున్న 30 రోజులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ మ్యానిఫెస్టోలోని హామీలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మల్లారం సర్పంచ్ కొమరం రాధాబాయి భర్త నారాయణను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీశ్రెడ్డి, ఆత్మ చైర్మన్ భద్రయ్య, నాయకులు బొలిశెట్టి నర్సింహారావు, కామేశ్వరరావు, బూర సురేశ్, సోంపెల్లి తిరుపతి, కార్యకర్తలు పాల్గొన్నారు.