మధిర, ఫిబ్రవరి 05 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన శంకుస్థాపనలకే పరిమితమైందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, కేవలం ఎన్నికల స్టంట్లుగా శంకుస్థాపనలు తప్పా క్షేత్రస్థాయిలో ప్రారంభోత్సవాలు శూన్యమని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 21వ వార్డు బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఉమ్మడి అభ్యర్థి పరిశ నాగలక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇక్కడి నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మధిర ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త పనులకు కొబ్బరికాయలు కొడుతున్నారని దుయ్యబట్టారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులే నేటికీ మధిరకు గర్వకారణమని నిలుస్తున్నాయన్నారు. మధిర సమగ్ర అభివృద్ధి చెందాలన్నా, వార్డు సమస్యలు పరిష్కారం కావాలన్నా బీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి పరిశ నాగలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.వార్డులోని ప్రతి గడపకూ తిరుగుతూ అభ్యర్థి నాగలక్ష్మి ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు. గత పాలనలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ ప్రస్తుత వైఫల్యాలను ఎండగట్టేలా రూపొందించిన ‘బాకీ కార్డులను’ ఈ సందర్భంగా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కనుమూరు వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, యెన్నం శెట్టి అప్పారావు, పరిస శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు,సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.