ఖమ్మం, సెప్టెంబర్ 09 : విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా వారి దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ నేతలు తాజా రాజకీయాలకు తెరలేపి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆ అసంతృప్తి, వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి మళ్లించే రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. ప్రజల సమస్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమాధానం చెప్పకుండా ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.