ఖమ్మం, జూలై 17 : వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడంతో మూడు రంగుల కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక బుద్ధిని బయటపెట్టుకున్నదని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఇకడ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరమే లేదు.. ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలని అనేక మంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఆనాడు ఆగమైపోయిన అన్నదాతలు ఇప్పుడిప్పుడే తేరుకొని ఆనందంగా ఉన్నారని, 24 గంటల కరెంట్ వద్దు.. 3 గంటల కరెంట్ చాలు అంటూ.. దుర్మార్గమైన ఆలోచనను కాంగ్రెస్ బయటపెట్టిందని తెలిపారు. మూడు పంటల బీఆర్ఎస్ కావాలా.. మూడు గంటల కాంగ్రెస్ కావాలా.. తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలన్నారు. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ ఉండాలా.. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. రైతన్నలు ఆలోచన చేయాలని నామా పేరొన్నారు.