మణుగూరు టౌన్, డిసెంబర్ 7: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ప్రచార వాహనంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భౌతికదాడులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతరావు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ ప్రజలందరూ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల వెంట ఉంటున్నారని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు.. తాము ఓడిపోతామన్న భయంతోనే వారి కార్యకర్తలతో బీఆర్ఎస్పై దాడులకు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. మణుగూరు మండలం సమితి సింగారంలో బీఆర్ఎస్ ప్రచార వాహనం (ఆటో)పైనా, దాడి డ్రైవర్పైనా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ భద్రాద్రి జిల్లా మణుగూరులోని పోలీసుస్టేషన్ ఎదుట ఆదివారం నిర్వహించిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు.
ఆయన కథనం ప్రకారం.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా గుండి గౌరీ పోటీ చేస్తోంది. ఆమె తరఫున ఓ ప్రచార వాహనం (ఆటో) మైకు ద్వారా గ్రామంలో ప్రచారం చేస్తోంది. ఆదివారం ఆ గ్రామంలో ఓ వీధిలో ప్రచారం చేసుకుంటూ వెళ్లిన ఆ వాహనం.. ఆ వీధి అక్కడితో ముగియడంతో వెనక్కు మళ్లుతోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వాహనంపై దాడికి దిగారు. ‘ఈ వీధిలో తిరుగుతూ ఎందుకు ప్రచారం చేస్తార్రా..’ అంటూ ఆ వాహన డ్రైవర్ నజీర్పాషాపైనా దుర్భాషలాడారు. ఆ క్రమంలో అతడిపై దాడి చేశారు. దీంతో అతడు ఫోన్ చేసి చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులతోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా అక్కడికి చేరుకున్నారు.
దాడి విషయం గురించి తెలుసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ డ్రైవర్, తమ ప్రచారం వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు.. మణుగూరు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంట సమయం గడిచినా పోలీసులు కదలలేదు. నిందితులపై చర్యలకు ఉపక్రమించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినా రేగా కాంతారావు.. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మణుగూరు పోలీసుస్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ప్రచార వాహనంపైనా, ఆ వాహన డ్రైవర్పైనా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారంటూ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని, విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, కాంగ్రెస్ కార్యకర్తల దాడి తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుతంగా జరగాల్సిన ఎన్నికలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈసీ నిబంధనలను ఉల్లంఘించడం, గూండాయిజాన్ని ప్రదర్శించడం వంటివి హేయమైన చర్యలని అభివర్ణినించారు. ప్రజల మద్దతుతోనే విజయాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. బెదిరింపులు, దాడులతో బీఆర్ఎస్ని అడ్డుకోవడం అసాధ్యమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గుండి గౌరీ, బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్, పోశం నర్సింహారావు, అడపా అప్పారావు, వట్టం రాంబాబు, యాదగిరి గౌడ్, రంజిత్, రవి, సృజన్ పాల్గొన్నారు.