సత్తుపల్లి/పెనుబల్లి, జూన్ 7 : మద్యం మత్తులో ఓ హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోబోయిన ఓ మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన రాయల రామారావు(రాము) తన అనుచరులతో కలిసి కల్లూరు పట్టణంలోని చౌదరి హోటల్కు వచ్చాడు. తనకు టిఫిన్ కావాలని హోటల్ యజమాని మాగంటి బోసుబాబును అడగ్గా.. లేదని చెప్పడంతో ఆగ్రహంతో రాము, అతడి అనుచరులు హోటల్ యాజమాన్యం, సిబ్బందితో గొడవకు దిగారు. వెంటనే హోటల్ యజమాని కల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. విచారణ నిమిత్తం ఎస్సై వెళ్తున్నారనే విషయం తెలుసుకున్న రాము తన అనుచరులతో మళ్లీ హోటల్ వద్దకు చేరుకున్నాడు. గొడవకు సాక్షులుగా ఉన్న హోటల్ సిబ్బంది, యజమానిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే హోటల్ నడవనివ్వనని బెదిరించాడు. ఈ క్రమంలో ఎస్సై తన సిబ్బందితో హోటల్ వద్దకు వెళ్లగా.. ఎస్సై ఎదురుగానే రాము, అతడి అనుచరులు మద్యం మత్తులో గొడవకు దిగారు.
వారికి సర్ది చెప్పి కేసు విచారణ చేయాలనే ఉద్దేశంతో ఎస్సై వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాము, అతడి అనుచరులు మహిళా ఎస్సై విధులకు ఆటంకం కలిగిస్తూ ఆమెపై చెయ్యి వేసి నెట్టివేశారు. దీంతో ఎస్సై ఫిర్యాదు మేరకు రాముతోపాటు మొత్తం 10 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు రాయల రామారావుతోపాటు ఏడుగురిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు. గతంలో కూడా రామారావుపై తల్లాడ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదైందని ఆయన పేర్కొన్నారు.
పెనుబల్లి, జూన్ 7 : విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై హరితపై కొందరు కాంగ్రెస్ నాయకులు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేయడం హేయమైన చర్య అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఒక కేసు విషయమై ఘటనా స్థలానికి విచారణ కోసం వెళితే మద్యం మత్తులో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించడం సరికాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల పార్టీ డిమాండ్ చేసింది.
ఎస్సైపై దాడి యావత్ మహిళా సమాజంపై దాడిగా ఉన్నదని, ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, మాజీ జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, మాజీ ఎంపీపీ బీరవల్లి రఘు, సీనియర్ నాయకుడు డాక్టర్ లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు పేర్కొన్నారు.