మణుగూరు టౌన్, జూలై 13: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ మంత్రులను అడ్డుకుంటామని, ఎక్కడికక్కడ నిలదీస్తామని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తేల్చి చెప్పారు. మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు సందర్శనకు వస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. జిల్లా ప్రజలు, రైతాంగం తరఫున బీఆర్ఎస్ పార్టీ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తన పర్యటనను రద్దు చేసుకొని పారిపోయారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి 95 శాతం పనులు పూర్తి చేసిన సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరించి కోర్టులో కేసులు వేయించి పనులు నిలిపివేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఎకరానికైనా సాగునీరు ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వారి మూడు ముక్కలాటలో అధికారులు బలైపోతున్నారే తప్ప జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు.
రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడితే ఈ ప్రభుత్వానికి ముందుచూపు లేదన్నారు. రైతు భరోసా, రుణమాఫీపై సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. యూరియా కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్లు చూపిస్తూ పెద్ద ఎత్తున స్కామ్ నడిపిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దీనిపై స్పందించకపోతే కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉన్నట్లేనని అనుమానం వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.