‘ధాన్యం కొనుగోలు అనేది రైతులకు జీవన్మరణ సమస్య. పంట పండించడం వరకే రైతుల బాధ్యత. పండించిన పంటను కొనుగోలు చేయడం మాత్రం పూర్తిగా కేంద్రం బాధ్యత. లేనిపోని కొర్రీలు పెట్టి కేంద్ర ప్రభుత్వం యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనలేమని చెప్తున్నది. కేంద్రం పంజాబ్, హర్యానాలో అక్కడి పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ రైతులపై మాత్రం వివక్ష చూపుతున్నది. ధాన్యం కొనుగోలుకు సమ్మతిస్తే సంతోషిస్తాం. లేకపోతే పోరాటానికి సిద్ధమవుతాం. తెలంగాణ ఉద్యమస్థాయిలో ఉద్యమిస్తాం. కేంద్రం మెడలు వంచుతాం’
– ముఖ్యమంత్రి కేసీఆర్
రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, పుష్కలంగా సాగునీరు, పండించిన పంటలకు మద్దతు ధరలు.. వెరసి ఏటికేడు వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. కానీ, కేంద్రం ఈసారి రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేమని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సమావేశాలు నిర్వహించనున్నారు. మండల పరిషత్, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ ద్వారా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించనున్నారు. ఉభయ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
-ఖమ్మం, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, మార్చి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, పుష్కలంగా సాగునీరు, పండించిన పంటలకు మద్దతు ధరలు.. వెరసి రాష్ట్రంలో వరి సాగు విస్తారమైంది. స్వరాష్ట్రం వచ్చిన నాటి నుంచి ఏటికేడు వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. కానీ, కేంద్రం ఈసారి రాష్ట్ర రైతులు పండంచిన ధాన్యాన్ని కొనలేమని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పంజాబ్తో పాటు కొన్ని ఉత్తరాది రాష్ర్టాల్లో రైతులు పండించిన పంటను కేంద్రం కొంటున్నదని, ఇదే రీతిలో తెలంగాణలోనూ కొనుగోలు చేసేలా కేంద్రం మెడలు వంచాలని సంకల్పించారు. రైతులపై చూపుతున్న వివక్షకు సరైనా సమాధానం ఇవ్వాలని భావించారు. ఈ మేరకు టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా మంగళవారం పార్లమెంట్ సభ్యులు, మంత్రులు మంగళవారం కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ బృందంలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై చూపుతున్న వివక్షను నిరసిస్తూ ఈనెల 24న నియోజకవర్గ కేంద్రాల్లో శాసనసభ్యుల ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మునిసిపాలిటీ, నగర కార్పొరేషన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ద్వారా యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని తీర్మానాలు చేయనున్నారు. తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతులపై కక్ష కట్టిన విధానాన్ని ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున 24న ఖమ్మంలో జరగాల్సిన నియోజకవర్గ సమావేశం వాయిదా పడింది. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, పలువురు ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్లు పాల్గొన్నారు. అధినేత ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఆందోళనకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు.