అశ్వారావుపేట, జనవరి 12 : కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. హైకోర్టుకు బయో డైవర్సిటీ భూముల కేటాయింపును నిరసిస్తూ శుక్రవారం భోజన విరామ సమయంలో విద్యార్థినీ విద్యార్థులు స్థానిక కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తొలుత కళాశాల ప్రాంగణం నుంచి జాతీయ రహదారి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం పలువురు విద్యార్థులు మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి కీలక పరిశోధనలపై భూముల కేటాయింపు పెను ప్రభావం చూపుతుందన్నారు. పర్యావరణవేత్తలు, పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, నాయకులు వర్సిటీ భూముల రక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు నిర్మాణంతో పర్యావరణానికి తీరని నష్టం కలుగుతుందని, అరుదైన వృక్ష, జీవజాతులు అంతరించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలో పచ్చని వాతావరణానికి చిచ్చుపెడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 55ను రద్దు చేయకుంటే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.