రఘునాథపాలెం, డిసెంబర్ 13: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ సర్కారులోనే రఘునాథపాలెం మండలం సమగ్రాభివృద్ధిని సాధించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేవలం గడిచిన మూడేళ్లలోనే రూ.255 కోట్ల నిధులను మండల అభివృద్ధి పనుల నిమిత్తం వెచ్చించినట్లు వివరించారు. కోటపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి వస్తున్న మంత్రిని ఖమ్మం ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు కోయచలక క్రాస్రోడ్డు వద్ద భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి 5 కిలోమీటర్ల మేర ద్విచక్ర వాహన ర్యాలీగా కోటపాడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కోటపాడు గ్రామస్తులతో తనకు ఉన్న అనుబంధం మర్చిపోలేనిదని అన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీని అందించి తన గెలుపులో ఈ గ్రామం కీలకపాత్ర పోషించిందని అన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేనికి ఎనిమిదేళ్లుగా తనకు వచ్చిన సీడీపీ నిధులన్నీ కేటాయిస్తున్నట్లు చెప్పారు. జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభింంచినందుకు సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ల వంటి పథకాల్లో ఏదో ఒక పథకం ప్రతి గడపకూ చేరుతోందని వివరించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ సభలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు మాళోతు ప్రియాంక, భుక్యా గౌరి, గుత్తా రవి, లక్ష్మీప్రసన్న, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బాతుల రమణా సుధాకర్, మద్దినేని వెంకటరమణ, పిన్ని కోటేశ్వరరావు, మాదంశెట్టి హరిప్రసాద్, అజ్మీరా వీరూనాయక్, కుర్రా భాస్కర్రావు, మందడపు సుధాకర్, మందడపు నర్సింహారావు, గుడిపూడి రామారావు, మెంటెం రామారావు, గొర్రె శ్రీనివాసరావు, దొంతు సత్యనారాయణ, కాంపాటి రవి, గుండ్ల ముత్తయ్య, బాతుల సుధాకర్, రామా వెంకటేశ్వర్లు, కొలపిన్ని వెంకటేశ్వర్లు, పగిళ్ల ఉపేందర్, బలంతు ముత్తయ్య, జంగాల శ్రీనివాసరావు, నర్సింహారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. టీఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అధ్యక్షతన మంగళవారం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన టీఎన్జీవోస్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ఏకైక సంఘం టీఎన్జీవోస్ అన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, సభ్యులు రాజేశ్, సత్యనారాయణ గౌడ్, రామినేని శ్రీనివాస్, అఫ్జల్ హసన్, ఆర్వీఎస్ సాగర్, శ్రీను పాల్గొన్నారు.