ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 1: భూయజమానికి తెలియకుండా మరోవ్యక్తి పేరుపై భూమి బదలాయించిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల తహసీల్దార్ కృష్ణపై కలెక్టర్ వీపీ గౌతమ్ వేటు వేశారు. ధరణి పోర్టల్ ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించి గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలిసిన వివరాల ప్రకారం.. జాస్తిపల్లికి చెందిన దమ్మలపాటి శేషమ్మ అనే వృద్ధురాలి భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. ఆమెకు కుమారుడు వెంకటనారాయణ, కుమారై ఉన్నారు. ఇద్దరికీ వివాహమైంది. కొన్ని కారణాల రీత్యా వృద్ధురాలు ఖమ్మంలోని తన సోదరుల ఇంట్లో ఉంటున్నది.
ఆమె పేరుపై జాస్తిపల్లిలో ఐదెకరాల భూమి ఉంది. తల్లి పేరిట ఉన్న భూమిని ఎలాగైనా తన పేరుపై మార్చుకోవాలని కుమారుడు పథకం రచించాడు. స్థానిక నాయకుల సహకారంతో కామేపల్లి తహసీల్దార్ కృష్ణను సంప్రదించాడు. దీనిలో భాగంగా వెంకటనారాయణ తల్లి పేరుపై ఉన్న ఐదెకరాల్లో మూడెకరాల భూమిని తన పేరుపై మార్చేందుకు తహసీల్దార్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది జూలైలో వృద్ధురాలు పనుల నిమిత్తం జాస్తిపల్లిలోని తన ఇంటికి వచ్చింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఇదే నెల 29న అప్పటి వీఆర్వో జానకిరాములు, ధరణి ఆపరేటర్ వెంకటేశ్వర్లు వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. తాము బ్యాంకు అధికారులమంటూ తమను పరిచయం చేసుకున్నారు.
తమ బ్యాంకు నుంచి రూ.4 లక్షల రుణం ఇస్తామని, రుణం పొందేందుకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉందని వృద్ధురాలిని నమ్మబలికారు. రుణం వస్తుందని నమ్మిన వృద్ధురాలు వీఆర్వో, ధరణి ఆపరేటర్ సంతకం చేయమన్న చోట సంతకం చేసింది. సాక్షులుగా ఇద్దరు కావాలని వారు కోరడంతో ఇద్దరు గ్రామస్తులను పిలిపించి సంతకం చేయించింది. అనంతరం వీఆర్వో, ధరణి ఆపరేటర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాక్షిగా సంతకం చేసిన ఓ వ్యక్తి డాక్యుమెంట్పై ఉన్న వివరాలను వృద్ధురాలికి వివరించాడు. వృద్ధురాలి పేరుపై ఉన్న ఐదెకరాల భూమిలో మూడెకరాలను వెంకటనారాయణ పేరుపై మార్చుకుంటున్నాడని తెలిపాడు.
వెంటనే అప్రమత్తమైన వృద్ధురాలు తన భూమిని కాజేసిన కుమారుడితో పాటు అతడికి సహకరించిన తహసీల్దార్, వీఆర్వో, ధరణి ఆపరేటర్పై ఖమ్మంలో కలెక్టర్ వీపీ గౌతమ్కు ఫిర్యాదు చేసింది. ఘటనపై కలెక్టర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. భూయజమానికి తెలియకుండా తహసీల్దార్ మరొకరి పేరుపై భూమి బదలాయించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదే కాక సదరు తహసీల్దార్ హెచ్ఎం 33 దరఖాస్తుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కలెక్టర్ సీరియస్గా తీసుకున్నారు. తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.