ఖమ్మం, ఆగస్టు 2: ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర అని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. ఖమ్మం ఐడీవోసీలో బుధవారం ఏర్పాటు చేసిన సెక్టార్ అధికారుల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా సెక్టార్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఈ సెక్టార్ అధికారులు అనుసంధానమై ఉంటారని అన్నారు. ఒకో రిటర్నింగ్ అధికారి కింద 20 నుంచి 30 సెక్టార్లు ఉంటాయని, ఒకో సెక్టార్ అధికారికి 10 నుంచి 20 పోలింగ్ కేంద్రాల పరిధి ఉంటుందని అన్నారు. సెక్టార్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తామన్నారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్నీ సందర్శించి వసతులను, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలని సూచించారు.
తమ పరిధిలో సోషల్, కమ్యూనిటీ, పొలిటికల్, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలా ఉన్నాయో పర్యవేక్షించాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్హెచ్వోలను పరిచయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలన్నారు. ఎన్నికలకు ఎలక్టోరల్, ఈవీఎం, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది కీలకమని కలెక్టర్ అన్నారు. ప్రతి ఎన్నికలనూ కొత్తగానే చూడాలని, ఏ దశలోనూ ఎటువంటి తప్పిదాలకూ ఆసారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల నిర్వహణపై సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈవీఎంలపై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు. అదనపు కలెక్టర్లు అభిలాష, మధుసూదన్నాయక్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, కల్లూరు ఆర్డీవో అశోక్ చక్రవర్తి, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.