మామిళ్లగూడెం, మార్చి 6: ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లిలో రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ ఆస్తుల కచ్చిత విలువను నిర్ణయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ టౌన్షిప్ ఆస్తుల విలువను నిర్ణయించేందుకు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పడింది. దీని మార్గదర్శకాలపై రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బీ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో ఐడీవోసీలోని సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ గౌతమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
అసంపూర్తిగా ఉన్న ఎనిమిది టవర్స్లోని 576 ఫ్లాట్స్, ఖాళీ స్థలం విలువ నిర్ధారణపై ఈ సమావేశం చర్చించింది. ప్రతిపాదనలతో కూడిన నివేదికను రూపొందించింది. దీనిని ప్రభుత్వానికి పంపేందుకు ఆమోదం తెలిపింది. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎస్ఈ సి.భాసర్రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్యాంప్రసాద్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పద్మ, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి జి.గణేష్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.