ఖమ్మం, మార్చి 28 : ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ రక్షణ బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. జాబితాను తగు చర్యల నిమిత్తం భూ రక్షణ బృందాలకు అందజేశామని, వాటిపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. స్థలాలవారీగా అధికారులు చేపట్టిన చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఖాళీ స్థలాల్లో క్రమబద్ధీకరణ జీవో 59లో చేసుకున్న దరఖాస్తులు తిరసరణకు గురైన చోట వెంటనే స్థలాలను స్వాధీనం చేసుకొని రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
వైఎస్సార్ కాలనీలో ఎక్స్ సర్వీస్మెన్లకు కేటాయించిన అసైన్డ్ భూమిపై సర్వే చేసి సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. పువ్వాడ ఉదయ్ నగర్లో ఖాళీ ప్లాట్ల విషయమై చర్యలు తీసుకోవాలన్నారు. టేకులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లలో లబ్ధిదారులు నివాసం లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నిర్మాణాలను గుర్తించి వెంటనే తొలగించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి.మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, ఆర్డీవో జి.గణేశ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ ఒకటో తేదీలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో యాసంగి ధాన్యం సేకరణ కార్యాచరణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యాసంగిలో 1,71,357 మెట్రిక్ టన్నుల ధాన్యం మారెట్కు రానున్నట్లు అంచనా ఉందన్నారు. సెక్టార్లవారీగా ధాన్యం రవాణాకు ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లను సిద్ధం చేయాలన్నారు. మిల్లర్లు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు, సంబంధిత వ్యక్తులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.
కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. నీడ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి కనీస మద్దతు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, జిల్లా మారెటింగ్ అధికారి అలీం, జిల్లా సహకార అధికారి మురళీధర్రావు, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్టీవో ఆఫ్రీన్, డీఎం మార్ఫెడ్ సునీత, అధికారులు పాల్గొన్నారు.