మధిర, ఫిబ్రవరి 12 : అపరిష్కృత సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను నిశితంగా పరిశీలించి.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మధిర పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.
వివిధ సమస్యలపై 106 అర్జీలు వచ్చాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఆమోదం కొరకు పంపించామన్నారు. ప్రధానంగా పశుసంవర్థక శాఖకు సంబంధించి 33, రెవెన్యూ 25, వైద్య, ఆరోగ్య శాఖ 11, మున్సిపాలిటీలకు సంబంధించి 9 అర్జీలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీ.సత్యప్రసాద్, జడ్పీ సీఈవో వీవీ.అప్పారావు, డీపీవో హరికిషన్, డీఆర్డీవో విద్యాచందన, ఆర్డీవో జీ.గణేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.