ఖమ్మం వ్యవసాయం, జనవరి 19: మిర్చి ధరల విషయంలో రైతులను ఖరీదుదారులు మోసం చేయొద్దని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. అలా చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం ఏఎంసీలో మిర్చి ధరల పతనంపై ‘ధర దగా..’ శీర్షికన నమస్తే తెలంగాణలో గురువారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్తో కలిసి ఖమ్మం మిర్చియార్డును శుక్రవారం పరిశీలించి మిర్చి పంట కొనుగోళ్లను తనిఖీ చేశారు. మిర్చి రైతులతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన మిర్చి పంటకు ధర తగ్గిస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్కెటింగ్శాఖ సంచాలకులు, ఉన్నతాధికారులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వచ్చి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. నాణ్యత మేరకు ధర రావడం లేదని ఆరోపణలు వస్తున్నందున వాటి పర్యవేక్షణకు ముగ్గురు వ్యవసాయశాఖ అధికారులను నియమించినట్లు తెలిపారు.
అలాగే తాలు, వైరస్, నాణ్యతా ప్రమాణాల పరీక్షకు ఉద్యాన శాఖ నుంచి టెక్నికల్ అధికారిని వ్యవసాయ మార్కెట్లో నియమించినట్లు చెప్పారు. వీరంతా మార్కెట్లో పూర్తి సమయం అందుబాటులో ఉంటారన్నారు. జెండాపాట రూ.20 వేలు ఉండగా, శుక్రవారం ధర రూ.20,500 పలికిందన్నారు. కానీ గురువారం ధర రూ.21,300 పలికిందని అన్నారు. వైరస్, తుఫాను వల్ల నాణ్యత తగ్గిన మిర్చిపంట క్వింటాకు రూ.13 వేల నుంచి రూ.17 వేల వరకూ ధర పలుకుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు మాదిరిగా మిర్చి కొనుగోలులోనూ తేమశాతంపై చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యత పేరుతో రైతులను ఖరీదుదారులు నష్ట పరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారను. వారి లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి బస్తా కొనుగోలు అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, పీడీఎంఐపీ రమణ, మార్కెట్ కమిటీ గ్రేడ్-టూ అధికారి బజార్ తదితరులు పాల్గొన్నారు.