మామిళ్లగూడెం, డిసెంబర్ 18: అర్జీదారుల సమస్యల పరిషారానికి మొదటి ప్రాధాన్యమివ్వాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం తదుపరి చర్య, పరిష్కారం కోసం వాటిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఆయా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అదనపు కలెక్టర్ బీ.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే తమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. ఖమ్మంలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్లో బాధితుల నుంచి ఆయన వినతులు స్వీకరించి మాట్లాడారు. అనంతరం ఆయా ఫిర్యాదులను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్వోలను ఆదేశించారు.