అశ్వారావుపేట రూరల్, మే 16: పెదవాగు ప్రాజెక్టు ఆక్రమణదారుల పై చర్యలు తీసుకుంటామని భధ్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి, కొత్తూరు, రంగాపురం, వడ్డెర రంగాపురం, బచ్చువారిగూడెం గ్రామాలకు చెందిన 300 మంది రైతులు సోమవారం కలెక్టరేట్కు వెళ్లారు. పెదవాగు ప్రాజెక్టు సమస్యలను గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వివరించారు. 1124 ఎకరాల విస్తీర్ణం గల ప్రాజెక్టును కొందరు ఆక్రమించి పుగాకు, మొక్కజొన్న, జనుము వంటి పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు.
దీంతో పూడిక చేరి నీటిమట్టం తగ్గిందన్నారు. సరిహద్దులు నిర్ణయించి నీటిపారుదలశాఖ అధికారులకు అప్పగించాలని కోరారు. ప్రాజెక్టుకు మూడు గేట్లు, కుడి-ఎడమ కాల్వలు ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేయించాలని కోరారు. ఐబీ అధికారుల పై తమకు నమ్మకం లేదని ఫిర్యాదు చేశారు. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని, దానిని కాపాడాలని విన్నవించారు. గతంలో 18 లష్కర్లు పని చేసేవారిని, ఇప్పడు ముగ్గురు మాత్రమే ఉన్నారని వివరించారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తానని నీటిపారుదల, రెవెన్యు అధికారులు ప్రాజెక్టును సందర్శిస్తారని, అధైర్యపడవద్దని రైతులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నారాయణపురం పీఏసీఎస్ ఉపాధ్యక్షులు పుట్టా సత్యనారాయణ, మేడికొండ సుబ్బారావు, డేరంగుల చిన్నయ్య, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.