భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఈ నెల 11న సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీలోని సమావేశ మందిరంలో ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాలయ దర్శనం తర్వాత జిల్లాలోని అభివృద్ధి పనులపై గిరిజన భవన్లో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నందున ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
లక్ష్మీపురం సమీపంలో ఎంపిక చేసిన సభా స్థలంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీరు ఏర్పాటు చేయాలని, హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక దళం సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లాలో జరిగే అన్ని అభివృద్ధి పనుల పురోగతిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో విద్యాచందన, డీఆర్వో రవీంద్రనాథ్, కలెక్టరేట్ ఏవో గన్యా, డీఎంహెచ్వో శిరీష, డీఎస్వో రుక్మిణి, భద్రాచలం ఆర్డీవో దామోదర్రావు, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆర్అండ్బీ ఈఈ అర్జున్, పీఆర్ ఈఈ శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాస్ పాల్గొన్నారు.