భద్రాద్రి కొత్తగూడెం, జూలై 31 (నమస్తే తెలంగాణ)/సత్తుపల్లి: బిడ్డకు అమ్మపాలు వరం.. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. తల్లిపాలతో తల్లికీ బిడ్డకూ లాభాలు ఉన్నాయి. తల్లిపాల విశిష్టత, బిడ్డకు ఎంతవయస్సు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వాలి.. రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలి.. పాలు పుష్కలంగా రావాలంటే తల్లులు ఎలాంటి ఆహారం తినాలి? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి.. ఇలా చాలా అంశాలపై అందరికీ అవగాహన ఉండదు. ఆధునిక కాలం అమ్మలకు మరింత తక్కువ. ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు, తల్లిపాల ప్రాముఖ్యతను చాటేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో ‘తల్లిపాల వారోత్సవాలు’ నిర్వహించనున్నారు.
బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలు ఇవ్వకూడదు. తల్లిపాలు తేలిగ్గా జీర్ణమవుతాయి. అంతేకాకుండా శుభ్రంగా ఎటువంటి క్రిములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత బిడ్డకు తల్లిపాలతోపాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలుపట్టాలి. దీంతో ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.
తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో తల్లి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదు. పాలు ఇచ్చే సమయంలో కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోకూడదు. ఇది బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.
ముర్రుపాలు తప్పనిసరి..
బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోనే తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. ఇందులో మాంసకృతులు, విటమన్ ఏ ఉంటుంది. వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవితకాలం కాపాడతాయి. శిశువు ప్రేగులను శుభ్రం చేసి మొదటి మలవిసర్జనకు తోడ్పడతాయి. తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడంలేదనుకోవడం అపోహ మాత్రమే. బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనె నాకించడం, పంచదార నీళ్లివడం, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వడం చేయరాదు.
తల్లిపాలు పుష్కలంగా రావాలంటే..
గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.
తల్లికి కలిగే లాభాలు..
తల్లులు చనుబాలు ఇవ్వడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గి త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. చనుబాలు ఇవ్వడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి ఉన్న పూర్వ బరువు తిరిగి పొందగలుగుతారు. బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భక్యాన్సర్లు రావు. తల్లీబిడ్డల మధ్య బంధం పెంపొందుతుంది. ఆరునెలల వరకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు సైతం పాలు పట్టించవచ్చు.
తల్లిపాలతో కలిగే లాభాలు..
తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సమతుల్యత కలిగిన ఆహారాన్ని అందిస్తాయి. నాణ్యమైన ప్రొటీన్లు ఓమేగా 3, 6, 9 బిడ్డ మెదడుకు వికాసాన్ని ఇస్తాయి. తల్లిపాలతో బిడ్డలకు అవసరమైన విటమిన్లు పుష్కలంగా అందుతాయి. శిశువులకు వచ్చే అంటువ్యాధులు, రక్తహీనత నుంచి కాపాడుతాయి. తల్లిపాలతో బిడ్డలకు డయేరియా, నిమ్మోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. అలర్జీ, అస్తమా, అంటువ్యాధులు రావు. బాల్యం, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.
జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలు..
ఖమ్మం జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 5,070 మంది బాలింతలు, 8,101 మంది గర్భిణులు, 0 నుంచి 6 నెలల వరకు చిన్నారులు 5,516 మంది, 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు పిల్లలు 38,405 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు 29,622 మంది ఉన్నారు. ఈ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో నేటి నుంచి వారంరోజులపాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తాం..
తల్లిపాల ప్రాముఖ్యంపై జిల్లాలో వారంరోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు గ్రామ పంచాయతీ, మండల, జిల్లాస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తాం. ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా తల్లులకు పూర్తిస్థాయిలో తల్లిపాల ప్రాముఖ్యతను వివరించి తల్లీబిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేస్తాం.
– జ్యోతి, జిల్లా సంక్షేమాధికారి
పుట్టిన గంటలో తల్లిపాలు పట్టాలి
బిడ్డ పుట్టిన అరగంట లేదా గంటలోపు కచ్చితంగా ముర్రుపాలు పట్టించాలి. ఆరు నెలలు తల్లిపాలు పట్టడంతో బిడ్డలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ముర్రుపాలపై తల్లుల్లో మరింత అవగాహన అవసరం. ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు తల్లిపాల ఆవశ్యకతపై వివరిస్తాం.
– డాక్టర్ అవినాష్, గంగారం పీహెచ్సీ
పుట్టిన గంటలోపే బిడ్డకు పాలివ్వాలి
తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. ముర్రుపాలు తాగితే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి వ్యాధులు రావు. తల్లులు తెలుసుకునే విధంగా అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 1 నుంచి వారంరోజులపాటు కార్యక్రమాలు చేపడతాము. ప్రతి ఆసుపత్రికి వెళ్లి తల్లులకు పాలు ఇచ్చే విధానం గురించి తెలియజేస్తున్నాం. జిల్లాస్థాయిలో తొలిరోజు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తాం.
– సబిత, డీడబ్ల్యూవో