మామిళ్లగూడెం, నవంబర్ 1: జిల్లాలో ఈ నెల 6 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి నియోజకవర్గ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా నివాస ప్రాంతాల్లో ఇళ్ల జాబితా రూపకల్పన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వేకు కావాల్సిన ఎన్యూమరేటర్ల గుర్తింపు, బ్యాగులు, స్టేషనరీ, సామగ్రి సేకరణ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
సర్వే కోసం ఎన్యూమరేషన్ బ్లాక్లోని ప్రతి ఇంటికి క్రమానుగత సంఖ్యను కేటాయించాలని, ఇళ్ల జాబితా పక్కాగా రూపొందితే సర్వే సమగ్రంగా నడుస్తుందన్నారు. నిర్దేశిత సర్వే ప్రణాళికను అనుసరిస్తూ మూడు రోజుల్లోపు హౌజ్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. దీనిపై సూపర్వైజర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, శిక్షణకు ఏర్పాట్లు చేయడంతోపాటు డాటా నమోదుకు ఆపరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ శ్రీజ, సీపీవో శ్రీనివాస్, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్, డీఈతో సోమశేఖర శర్మ, అదనపు డీఆర్డీవో నూరొద్దీన్, డీఎల్పీవో రాంబాబు పాల్గొన్నారు.