ఖమ్మం వ్యవసాయం, జనవరి 10: మిర్చి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసుదన్నాయక్ అధికారులకు సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును బుధవారం ఆయన సందర్శించి మిర్చి కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిర్చి ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరైన తేమ, నాణ్యత ఉన్న పంటను విక్రయానికి తెచ్చి రైతులు కూడా మంచి ధరను పొందాలని సూచించారు.
జిల్లాలో 2023-24 సంవత్సరంలో ఉద్యాన శాఖ అంచనా ప్రకారం 92,274 ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్లు, 23లక్షల క్వింటాళ్ల మిర్చి దిగుబడి రానున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మార్కెట్ కమిటీలకు 66,840 క్వింటాళ్ల మిర్చి పంటను ఖరీదుదారులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. పీడీ ఎంఐపీ రమణ, డీఎంవో అలీమ్, మార్కెట్ కార్యదర్శి బజార్ తదితరులు పాల్గొన్నారు.