గత నెలలో కురిసిన అకాల వర్షం పంటలను పొట్టనబెట్టుకున్నది.. వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు పంట నష్టపోయారు.. రైతుల దైన్యస్థితిని చూసి సీఎం కేసీఆర్ చలించిపోయారు. బోనకల్లు మండలంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అక్కడికక్కడే ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఆ చొప్పున నిధులు విడుదల చేశారు. దీంతో రైతులకు ఊరట కలిగింది.. కానీ ఇంతలోనే వరుణుడికి కన్నుకుట్టిందో ఏమో మరోసారి వడగండ్ల రూపంలో పంటలపై విరుచుకుపడ్డాడు. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వాన రైతుల పాలిట శాపమైంది. మరోసారి పంట దెబ్బతిన్నది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 251 మంది రైతులు 586 ఎకరాల్లో పండిస్తున్న వివిధ పంటలను నష్టపోయారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 7 వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్న 5,157 మంది రైతులు నష్టపోయారు. నష్ట తీవ్రత ముదిగొండ మండలంలో ఎక్కువగా ఉంది. ఒక్క ఈ మండలంలోనే 2,943 ఎకరాల పంట దెబ్బతిన్నది. దెబ్బతిన్న పంటలను బుధవారం కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా సాయం అందించేందుకు కృషి చేస్తామని బాధిత రైతులకు హామీ ఇచ్చారు.
ఖమ్మం, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా రైతులపై వరుణుడు కరుణ చూపడం లేదు. గత నెలలో అకాల వర్షం కురిపించి పంటలను తుడిచిపెట్టుకుపోయినా శాంతించలేదు. ఆదివారం రాత్రి వడగండ్ల రూపంలో రాలి మిగిలిన పంటలనూ పొట్టనపెట్టుకున్నాడు. మక్క, వరి కోతకు వచ్చే తరుణంలో పంట నేలవాలింది. చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 7 వేల ఎకరాల్లో సాగు చేస్తున్న 5,157మంది రైతులు పంట నష్టపోయారు. నష్ట తీవ్రత ముదిగొండ మండలంలో ఎక్కువగా ఉంది. ఒక్క ఈ మండలంలోనే 2,943 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. సోమ, మంగళవారాల్లో దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. మండలాల వారీగా పంట నష్టం నివేదికలు రూపొందిస్తున్నారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం వ్యవసాయశాఖ అధికారులతో కలిసి మండలంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 251 మంది రైతులు 586 ఎకరాల్లో వివిధ పంటలను నష్టపోయారు. సుజాతనగర్, పాల్వంచ, కొత్తగూడెం, జూలూరుపాడు, చుంచుపల్లి, మణుగూరు, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం మండలాల్లో నష్ట తీవ్రత ఉంది. మక్కలు, వరి ఎక్కువ మొత్తం, తక్కువ మొత్తంలో మామిడి, మినుములు, నువ్వులు, టమాటా, తోటలు దెబ్బతిన్నాయి.
సీఎం కేసీఆర్ భరోసా..
గత నెలాఖరులో అకాల వర్షం మక్క పంటను నేలవాల్చింది. బోనకల్లు మండలంలో నష్ట తీవ్రత ఎక్కువగా కనిపించింది. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రఖర్రావు స్వయంగా పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని చూసి చలించిపోయారు. సాధారణ రైతులతో పాటు కౌలు రైతులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే అధికారులతో చర్చించి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులనూ ఆదుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదికలు పంపించే పనిలో నిమగ్నమయ్యారు.
పంటల నష్టం వివరాలను త్వరగా నమోదు చేయాలి
అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలు త్వరితగతిన నమోదు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ముదిగొండ, మేడేపల్లి గ్రామాల్లో బుధవారం ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. అకాల వర్షాలకు దెబ్బ తిన్న వరి, మొక్కజొన్న పంటలను పరిశీలిచారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంటకు ఎంత మేరకు నష్టం జరిగింది? ఎంత పెట్టుబడి పెట్టారు? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం వచ్చిందని, దీంతో పంటంతా పూర్తిగా నేలమట్టమైందని రైతులు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ.. పంట నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దని, సమగ్ర వివరాల నమోదు తర్వాత ప్రభుత్వం పరిహారం అందిస్తుందని భరోసానిచ్చారు. కౌలు రైతులకు పట్టాదారు పాస్పుస్తకం లేకపోయినా వారి వివరాలను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. గతంలో దెబ్బతిన్న పంటల నష్ట పరిహారం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ అవుతుందని అన్నారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు విజయనిర్మల, నాగరాజు, వెంకటేశ్వర్లు, రాధ, శిరీష, శ్రీనివాసరావు, సామినేని హరిప్రసాద్, సూర్యానారయణ, మౌనిక, కొమ్మూరి స్వాతి, మందరపు ఎర్ర వెంకన్న, పోటు ప్రసాద్, భయ్యం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
-ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
చేతికి వచ్చిన పంట నీటి పాలైంది..
పంట చేతికి వచ్చింది. మరోరెండు రోజుల్లో వరి కోతలు ప్రారంభిద్దామని అనుకున్నాం. కానీ ఇంతలోనే వడగండ్ల వాన కురిసింది. వాన ధాటికి ఎకరన్నరలో సాగు చేస్తున్న వరి పంట నేలవాలింది. ధాన్యపు గింజలు నేలరాలాయి. పంట పూర్తిగా దెబ్బతింది. వెద్దజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నాను. నాట్లు వేసే పద్ధతిలో సాగు చేసి ఉంటే నష్ట తీవ్రత తక్కువగా ఉండేది. ఎకరానికి 40 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని అనుకుంటే ఇప్పుడు పది బస్తాలైనా చేతికొచ్చే పరిస్థితి లేదు.
– మండెల ఉపేందర్, రైతు, ముదిగొండ
ఆశలు అడియాశలు..
మాకు ఆరెకరాల మామిడి తోట ఉంది. ఈసారి కాపు బాగుంది. మంచి లాభాలు వస్తాయనుకున్నా. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు మామిడికాయలు రాలి కిందపడ్డాయి. పెట్టిన పెట్టుబడి అయినా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంట నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాం.
– మున్నం రవి, రైతు, ముదిగొండ
మక్క పంట దెబ్బతిన్నది..
నేను యాసంగిలో మూ డెకరాల్లో మక్కలు సాగు చేస్తున్నాను. పెట్టుబడి రూ.లక్ష వరకు పెట్టాను. మరికొన్ని రోజుల్లో పంట కోతలు ప్రారంభిద్దాం అనుకున్నాం. కానీ ఇంతలోనే అకాల వర్షం పంటను దెబ్బతీసింది. పంటను నేలమట్టం చేసింది. అధికారులు మా పంటను పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం మాకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నాన.
– బానోత్ రాందాస్, రైతు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలం
రూ.80 వేలు నష్టపోయాను..
నేను వానకాలంలో పత్తి సాగుచేశాను. అంతంతమాత్రంగా దిగుబడి వచ్చింది. మక్కలకు మంచి రేటు ఉందని యాసంగిలో మక్క లు సాగు చేశాను. పంట బాగా పం డింది. లాభాలు బాగా వస్తాయని ఆశించాను. కానీ వడగండ్ల వాన పంటను పూర్తిగా దెబ్బతీసింది. పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. సాగుకు రూ.80 వేల పెట్టుబడి పెట్టాను. మొత్తం నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప వచ్చే సీజన్లో సాగు చేపట్టలేని పరిస్థితిలో ఉన్నాను.
– ముత్యాల రమేశ్, రైతు, డేగల మడుగు, సుజాతనగర్ మండలం