వైరాటౌన్, ఏప్రిల్ 11 : ఏప్రిల్ చివరినాటికి సీనియర్ హాస్టల్ భవన నిర్మాణాలు బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. వైరాలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణ పనులను శనివారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైరా సాంఘిక సంక్షేమ గురుకులంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు.
పనులు మంచి వేగంతో కొనసాగుతున్నాయని, ప్రణాళిక ప్రకారం 4 జూనియర్, 9 సీనియర్ హాస్టల్ బ్లాకులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జూనియర్ హాస్టల్ బ్లాకుల రాప్ట్ ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయని, సీనియర్ హాస్టల్ బ్లాకు ఫౌండేషన్ పనులు ప్రారంభించి, పాత భవనాలను తొలగించి, ఏప్రిల్ నెలాఖరు నాటికి బేస్మెంట్ స్థాయికి తీసుకొనిరావాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పాఠశాలలల్లో జూనియర్, సీనియర్ హాస్టల్ బ్లాకులు, అకాడమిక్ బ్లాకులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి నివాసగృహాలు కూడా నిర్మించబడుతున్నాయన్నారు. ఈ స్కూళ్లకు సంబంధించిన భూ సంబంధిత సమస్యలన్నీ పరిష్కరించామని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఈడబ్ల్యూఐఈడీసీ ఈఈ బుగ్గయ్య, వైరా మున్సిపల్ కమిషనర్ గురులింగం, తహసీల్దార్ సురేష్, సంబంధితశాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది ఉన్నారు.