భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గ్రామస్థాయిలో ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యలను గుర్తించాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సూచించారు. అభివృద్ధి పనుల కోసం నాణ్యమైన ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై డీఆర్డీవో విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీఆర్వో పద్మావతి ఆధ్వర్యంలో ఎంపీడీవోలు,
ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఐడీవోసీలో గురువారం నిర్వహించిన ఒక్క రోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రజల అవసరాలు, ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ సమర్థవంతమైన అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. గ్రామసభల ద్వారా ప్రజల అవసరాలు, సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యమిస్తూ కార్యాచరణ చేయాలన్నారు. కాగా.. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, పంచాయతీ అడ్వాన్స్ ఇండికేటర్స్, పీఏఐ సూచికలను జీపీడీపీతో అనుసంధానం చేయడం ద్వారా నాణ్యమైన గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూపొందించే విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉత్తమ పనితీరు కనపర్చి రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా అధికారులు కృషిచేయాలని కోరారు.