ఖమ్మం, ఫిబ్రవరి 11: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాగు జలాల్లో వచ్చే వాటా కోసం తెలంగాణ తెచ్చారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కృష్ణాపై సాగు ప్రాజెక్ట్లను కేఆర్ఎంబీకి అప్పగించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే కృష్ణాజలాలు కృష్ణార్పణమయ్యాయని అభిప్రాయపడ్డారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల నిర్వహణ హకుల అప్పగింపు మున్ముందు తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్యగా పరిణమిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. కాబట్టి సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.