భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సారపాకలోని హెలిప్యాడ్లో లాండ్ కానున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం పట్టణానికి చేరుకోనున్నారు. అనంతరం పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. 12.50 గంటలకు మార్కెట్ రోడ్కు చేరుకుని మార్కెట్ కమిటీ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. 2 గంటలకు ఇరిగేషన్, రామాలయ అధికారులను సమీక్షించనున్నారు. అనంతరం మణుగూరు పట్టణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ప్రియాంక ఆల పరిశీలించారు. అధికారుల సమీక్షలకు రంగం సిద్ధం చేశారు.
సీఎం ముందు అనేక డిమాండ్లు..
పోలవరం ప్రాజెక్ట్ ముంపు సాకుతో కేంద్రం ఐదు పంచాయతీలతోపాటు కొన్ని మండలాలను నాడు ఆంధ్రాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ పంచాయతీలను తెలంగాణలో కలపాలని అనేక పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల అనేక రాజకీయ పార్టీ నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించి ఆయా డిమాండ్లను మీడియా ముందు ఉంచాయి. ఏటా వానకాలంలో భద్రాచలం పట్టణవాసులు వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందని, కరకట్టను ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్ట ఎత్తు పెంచడంతోపాటు నిర్మాణాన్ని పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికైనా సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
మణుగూరులో..
మణుగూరుటౌన్, మార్చి 10: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మణుగూరులో నిర్వహించే ప్రజాదీవెన సభకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న సభా వేదికను, పార్కింగ్ స్థలాలు, హెలీప్యాడ్లను పరిశీలించారు. ఆయనతోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. మరోవైపు కళాశాల ప్రాంగణం మొత్తాన్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుంది. సభావేదిక, హెలీప్యాడ్లు, పార్కింగ్ స్థలాలను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ముఖ్యమంత్రి సభకు చేరుకునే విధానాన్ని కాన్వాయ్తో ట్రయల్ రన్ చేసి పరిశీలించారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
భద్రాచలం, మార్చి 10 భద్రాచలంలో సోమవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మంత్రి వెంట ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్, కలెక్టర్ ప్రియాంక ఆల ఉన్నారు. మంత్రి అనంతరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ అనీల్కుమార్, ఆలయ ఈవో ఎల్ రమాదేవి నవమి ఏర్పాట్లపై సమీక్షించారు.